
హైదరాబాద్: మేము బ్యాటింగ్లో రాణిస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు, మా జట్టులోని సభ్యులు డ్యాన్స్లు చేయడం సంతోషంగా ఉందని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత సీమర్లు అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో భారత బౌలర్లు 60 వికెట్లు పడగొట్టగా అందులో పేసర్లే 26 వికెట్లు దక్కించుకున్నారు.
అత్యధికంగా మహ్మద్ షమీ 13 వికెట్లు పడగొట్టగా... ఆ తర్వాత చివరి రెండు టెస్టుల్లోనే ఉమేశ్ యాదవ్ 11 వికెట్లు దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం షమీ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాతో బీసీసీఐ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "భారత పిచ్లు ఎల్లప్పుడూ స్పిన్ ఫ్రెండ్లీగా ఉండేవి. గతంలో మేము(బౌలర్లు) బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్లు డ్యాన్స్లు చేసేవాళ్లు" అని అన్నాడు.
"ఇప్పుడు పరిస్థితులు మారాయి. మేము బ్యాట్తో కూడా సమాధానం చెప్పగలం. బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలరని తాజా సిరీస్లు రుజువు చేశాయి. మేము బ్యాటింగ్లో రాణిస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు, మా టీమ్ సభ్యులు డ్యాన్స్లు చేయడం సంతోషంగా ఉంది" అని షమీ పేర్కొన్నాడు.
కాగా, రాంచీ టెస్టులో బౌలర్ సిక్సర్ల మోతపై ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడాను. ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. బంతిని బ్యాట్తో కసి తీరా బాదమని చెప్పాడు. రాంచీ టెస్టులో నా బ్యాటింగ్ను చాలా ఎంజాయ్ చేశా?" అంటూ ఉమేశ్ సంతోషం వ్యక్తం చేశాడు.
సఫారీలతో ముగిసిన సిరిస్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. స్పిన్ ట్రాక్లపై కూడా రాణించగలమని వారు నిరూపించారని, అదేవిధంగా ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా విఫలమైన చోట మన వాళ్లు చక్కటి ప్రదర్శన చేయడంతో సంతోషంగా ఉందని రవిశాస్త్రి తెలిపాడు.