వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం
వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం వహిస్తుండగా... టీ20లకు దాసున్ షణకను కెప్టెన్గా ఎంపిక చేశారు. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీ20 కెప్టెన్ దాసున్ షణక మీడియాతో మాట్లాడుతూ "గతంలో పాక్లో ఆడాను. శ్రీలంక జట్టు కోసం ఏర్పాటు చేసిన భద్రత పట్ల సంతృప్తిగా ఉన్నాం. పాక్లో జట్టుని నడిపించడం సంతోషం" అని అన్నాడు.
బలమైన ఆతిథ్య జట్టుకు మంచి పోరాటం ఇస్తాం
"స్వదేశంలో పాక్ బలమైన జట్టు. దీంతో బలమైన ఆతిథ్య జట్టుకు మంచి పోరాటం ఇస్తామని ఆశిస్తున్నాం" అని దాసున్ షణక అన్నాడు. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు ఓ బుద్ధ సన్యాసి వారికి రక్షణగా తాయత్తులు కట్టాడు. కాగా, పాక్లో శ్రీలంక పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందంటూ తమకు హెచ్చరికలు వచ్చాయని శ్రీలంక బోర్డు పేర్కొన్న సంగతి తెలిసిందే.
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి
2009లో శ్రీలంక జట్టు పాక్ పర్యటనలో ఉన్నప్పుడు లాహోర్లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో శ్రీలంకకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ హోం మ్యాచ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహిస్తోంది.
కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు
అయితే, ఇన్నాళ్లకు మళ్లీ అదే శ్రీలంక జట్టు పాక్లో పర్యటించేందుకు ముందుకొచ్చింది. కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు... అక్టోబర్ 3న లాహోర్ వేదికగా మూడో టీ20 జరగనుంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగలతో పాటు సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు నిరాకరించారు.
యువ ఆటగాళ్లకు చోటు
ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరిస్ కోసం ప్రకటించిన జట్లలో శ్రీలంక క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇటీవలే ద్వైపాక్షిక సిరీస్ను తటస్థ వేదికకు మార్చాలని శ్రీలంక చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. పాక్లో అంతర్జాతీయ క్రికెట్కు పూర్వవైభవం తీసుకురావాలనే వారి ప్రణాళికలు ప్రమాదంలో పడుతాయని పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్లో శ్రీలంక పర్యటన షెడ్యూల్:
వన్డేలు
1st ODI on September 27 in Karachi
2nd ODI on September 29 in Karachi
3rd ODI on October 3 in Karachi
టీ20లు
1st T20I on October 5 in Lahore
2nd T20I on October 7 in Lahore
3rd T20I on October 9 in Lahore