న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడబోతున్నాడు. అతడు వార్విక్షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటికే బ్రిటన్ చేరుకున్న విహారి.. ఈ సీజన్లో వార్విక్షైర్ తరఫున కనీసం మూడు మ్యాచ్లు ఆడనున్నాడు. ఈ విషయాన్ని వార్విక్షైర్ ప్రకటించకపోయినా.. బీసీసీఐ ఖరారు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లండ్కు వెళ్లి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని హనుమ విహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. 2019లో చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన విహారి.. ఆ తర్వాత వేలంలో అమ్ముడుపోలేదు. అతనిపై టెస్టు స్పెషలిస్ట్గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో విహారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అతనికి అవకాశం దక్కలేదు. టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి (పుజారాతో కలిసి) ఐపీఎల్ రూపంలో మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుండగా.. తనకు ఆ అవకాశం లేకపోవడంతో కౌంటీలకు వెళ్లాలని భావించాడు.