టాప్ స్కోరర్గా నిలిచిన ఇమాముల్ హక్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ను ముస్తాఫిజుర్ (4/43) దెబ్బ కొట్టడంతో పాక్ ఓవర్లన్నీ ఆడి 202/9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ (83) టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా ఎలాగైతే వికెట్లను చేజార్చుకుందో పాక్ కూడా ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడం విశేషం. మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఫఖర్ జమాన్ (1)ను మెహ్దీ హసన్ క్యాచ్ అవుట్ చేయగా.. బాబర్ ఆజమ్ (1), కెప్టెన్ సర్ఫ్రాజ్ (10)ను ముస్తాఫిజుర్ పెవిలియన్ చేర్చాడు.
ఆదుకునే ప్రయత్నం చేసిన షోయబ్ మాలిక్
18/3తో కష్టాల్లోపడ్డ పాక్ను హక్, వెటరన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ (30) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, మాలిక్ను అవుట్ చేసిన రూబెల్.. నాలుగో వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. షాదాబ్ ఖాన్ (4) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హక్, అసిఫ్ అలీ (31) ఆరో వికెట్కు 71 పరుగులు జత చేయడంపై పాక్ శిబిరంలో గెలుపు ఆశలు మొదలయ్యాయి. అయితే, వీరిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో పాకిస్థాన్ ఓడిపోయింది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్తో మళ్లీ జట్టులో చోటుదక్కించుకున్న జునైద్ ఖాన్.. వరుస ఓవర్లలో ఓపెనర్లు సౌమ్య సర్కార్, లిటన్ దాస్లను పెవిలియన్ చేర్చి షాకిచ్చాడు. వన్ డౌన్లో దిగిన మోమినుల్ హక్ (5) మరోసారి విఫలమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే ఔట్ అవుతుందని అంతా భావించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్, మహమ్మద్ మిథున్ బాధ్యతయుతమైన ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు.
మూడో వికెట్కు 144 పరుగుల సెంచరీ భాగస్వామ్యం
వీరిద్దరూ మూడో వికెట్కు 144 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లా కోలుకుంది. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూనే స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో ముష్ఫికర్ కెరీర్లో 30వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని హసన్ అలీ విడదీశాడు. హాఫ్ సెంచరీ అనంతరం ధాటిగా ఆడుతున్న మిథున్ను హసన్ అలీ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. భారీ అంచనాలు మధ్య బరిలోకి దిగిన ఇమ్రుల్ కయస్ (9)ను షాబాద్ ఖాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే, ముష్ఫికర్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడనున్న బంగ్లాదేశ్
99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహీమ్.. షా అఫ్రీది బౌలింగ్లో కీపర్కు క్యాచిచ్చాడు. టెయిలెండర్ల అండతో మహ్మదుల్లా (25) జట్టు స్కోరును 200 పరుగుల మార్క్ని దాటించాడు. మెహ్దీ హసన్ (12), రూబెల్ హొస్సేన్ (1) స్వల్ప స్కోర్లకే ఔట్ కాగా.. కెప్టెన్ మోర్తజా (13) ఆఖరి వికెట్గా పెవిలియన్ చేరాడు. తాజా విజయంతో బంగ్లాదేశ్ శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడనుంది.