లక్ష్యం అదే: టెస్టు బెర్త్ కోసం ఐపీఎల్కు దూరమైన ఆసీస్ హిట్టర్

హైదరాబాద్: వచ్చే ఏడాది వరల్డ్కప్ పుణ్యమా అని ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2019 సీజన్కు దూరమయ్యారు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్కు దూరం కానున్నాడు.
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాన్న ఉద్దేశంతోనే ఐపీఎల్కు దూరమవుతున్నట్లు గ్లెన్ మ్యాక్స్వెల్ చెప్పాడు. ఐపీఎల్ 2019 సీజన్ సమయంలో మ్యాక్స్వెల్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 30 ఏళ్ల మ్యాక్స్వెల్ చాలాకాలంగా టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్నాడు.

సెప్టెంబర్లో చివరి టెస్టు ఆడిన మ్యాక్స్వెల్
బంగ్లాదేశ్తో 2017 సెప్టెంబర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై భారత జట్టుతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో అతడికి చోటు దక్కలేదు. టెస్టు క్రికెట్లోకి పునరాగమనం చేయాలన్న కోరిక అతడిలో ఇంకా బలంగా పెరగడంతో ఐపీఎల్కు దూరమయ్యాడు.

కౌంటీల్లో లాంకాషైర్ జట్టు తరఫున
ఆస్ట్రేలియా మాజీ టెస్టు ఓపెనర్ జో బర్న్స్, ఆల్రౌండర్ జేమ్స్ ఫాల్క్నర్తో కలిసి అతడు లాంకాషైర్ తరఫున కౌంటీల్లో ఆడనున్నాడు. ఐపీఎల్కు దూరం కావాలని నిర్ణయించుకోవడం ఇంకా టెస్టు క్రికెట్ ఆడాలన్న తన పట్టుదలకు నిదర్శనమని మెల్బోర్న్ హెరాల్డ్ సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు.

అతి పెద్ద కఠిన నిర్ణయం
"‘ఐపీఎల్కు దూరం కావాలనుకోవడం అతి పెద్ద కఠిన నిర్ణయం. దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. నా మదిలో ఇంకా టెస్టు క్రికెట్ ఆడాలన్న బలమైన కోరికే ఇందుకు కారణం" అని మ్యాక్స్ పేర్కొన్నాడు. గత సీజన్లో మ్యాక్స్వెల్ను భారీ ధర చెల్లించి ఢిల్లీ డేర్డెవిల్స్ సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో రాణించలేదు.

తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో విజయం
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య పెర్త్ వేదికగా రెండో టెస్టు శుక్రవారం నుంచి జరగనుంది. రెండో టెస్టు కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టుని ప్రకటించింది.

రోహిత్, అశ్విన్ దూరం
గాయాల కారణంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్లు దూరమయ్యారు. రెండో టెస్టుకు గురువారం బీసీసీఐ 13 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్కు బదులు హనుమ విహారి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్లకు చోటు కల్పించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications