కోహ్లీతో ఏకీభవించిన గంభీర్:
తాజాగా గంభీర్ మాట్లాడుతూ... 'అది కోహ్లీ వ్యక్తిగత ఆలోచన. గంగూలీ సారథ్యంలోనే విదేశాల్లో మన జట్టు విజయ పరంపర ప్రారంభం అయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మాజీ కెప్టెన్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, ఆ తర్వాత కెప్టెన్ల నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో ఆధిపత్యం కనబరిచేది. అయితే గంగూలీ నాయకత్వంలో మనం విదేశాల్లో గెలవడం మొదలైంది. గంగూలీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామన్న కోహ్లీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా' అని పేర్కొన్నాడు.
దూకుడు నేర్పిందే దాదా:
టెస్ట్ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడుతూ... 'భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం. మ్యాచ్లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణం. టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం. దాన్ని ఎలా జయించాలో దాదా నుంచి నేర్చుకున్నాం' అని కోహ్లీ తెలిపాడు.
అప్పటికీ కోహ్లీ పుట్టలేదు:
గావస్కర్ మాట్లాడుతూ... 'డే/నైట్ అద్భుతమైన విజయం. జట్టులోని అందరూ బాగా ఆడారు. అయితే భారత జట్టు విజయ పరంపర 2000 నుంచి దాదా జట్టుతో మొదలైందని విరాట్ కోహ్లీ అన్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని తెలుసు. కాబట్టి దాదా గురించి కోహ్లీ బాగా మాట్లాడాడు. టీమిండియా 1970, 80ల్లోనే విజయాలను నమోదు చేసింది. అప్పటికీ కోహ్లీ పుట్టలేదు' అని అన్నాడు.
అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్లు డ్రా చేసుకున్నాం:
'2000ల్లోనే క్రికెట్ ప్రారంభమైందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. కానీ.. భారత జట్టు 70ల్లోనే విదేశాల్లో విజయాలు నమోదు చేసింది. 1986లోనూ గెలుపొందింది. అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్లు డ్రా చేసుకుంది. ఇతర జట్లలాగే ఓటమిపాలైంది' అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.