|
రెండేళ్ల జీతం విరాళం
కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు.ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ చేసాడు. 'దేశం మనకోసం ఏం చేసింది? అని ప్రజలు అడుగుతున్నారు. కానీ.. నిజమైన ప్రశ్న ఏంటంటే.. నీ దేశానికి నువ్వు ఏం చేశావు?. నా వంతు సాయంగా రెండు సంవత్సరాల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నా. మరి మీరు?' అని పీఎం మోదీ, జేపీ నడ్డా, బీజేపీ ఢిల్లీ అనే హ్యాష్ట్యాగ్లను జతచేసి ట్విటర్లో పోస్ట్ చేశాడు.
ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు
గౌతమ్ గంభీర్ ఇదివరకే కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ లేఖ రాశాడు. అప్పుడు ఎంపీగా తన ఉదారతను చాటుకున్న గంభీర్.. ఇప్పుడు తన మంచి మనసును చాటుకున్నాడు.
అవసరమైతే జైల్లో వేయాలి
గంభీర్ లాక్డైన్ నేపథ్యంలో ప్రజల నిర్లక్ష్యంపై కూడా స్పదించాడు. కరోనా మార్గదర్శకాలను ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జైల్లో వేయాలని పోలీసులకు సూచించాడు. 'మీ నిర్లక్ష్యం వల్ల మీ ఒక్కరే కాదు.. మీ కుటుంబం మొత్తాన్ని జైలు లేదా క్వారంటైన్కు తీసుకువెళ్తారు. దయచేసి సమాజానికి ముప్పుగా ఉండకండి. ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు చేస్తున్న ఈ యుద్దం జీవితం కోసం. దీనికన్నా ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువ కాదు. అత్యవసర సేవలు అందించే వారు మినహా మిగతావారు లాక్డౌన్ను అనుసరించండి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జైహింద్' అని ట్వీట్ చేశాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు
గంభీర్ భారత్ తరపున 58 టెస్ట్లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్ దిగ్విజయంగా సాగింది. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్ కూడా ఒకడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2011 ప్రపంచకప్ ఫైనల్లో టాప్ స్కోరర్ కావడం మరో విశేషం.