లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా.. వార్తల్లోకెక్కారు. ఈ మధ్యకాలంలో ఆయన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ క్రికెట్ వీరుడు క్రిస్ గేల్తో కలిసి దిగిన ఓ ఫొటోను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గ్రేట్ క్యాచప్ విత్ మై గుడ్ ఫ్రెండ్ అంటూ.. దానికి తన కామెంట్స్ను యాడ్ చేశారు. ఈ ఫొటోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తోన్నారు. ఈ ఫొటో కాస్త వైరల్గా మారింది.
విజయ్ మాల్యాకు క్రిస్ గేల్ మంచి స్నేహితుడు. వారిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు క్రిస్ గేల్. ఒకప్పుడు ఈ ఫ్రాంఛైజీ విజయ్ మాల్యాదే. ఆయనే దీనికి ఆద్యుడు కూడా. 2008లో విజయ్ మాల్యా ఆర్సీబీని ఏర్పాటు చేశారు. 2011లో క్రిస్ గేల్.. ఈ జట్టులో చేరాడు. 2017 వరకూ కొనసాగాడు.
దీనితో విజయ్ మాల్యా-క్రిస్ గేల్ మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ తరఫున క్రిస్ గేల్ సక్సెస్ఫుల్ ప్లేయర్. పలు మ్యాచ్లల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఆర్సీబీ తరఫున 91 మ్యాచ్లు ఆడాడు. 3,420 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ హయ్యెస్ట్ వ్యక్తిగత బ్యాటింగ్ స్కోర్ 175 పరుగులు చేసింది కూడా ఆర్సీబీ తరఫునే. క్రిస్ గేల్ బ్యాటింగ్ యావరేజ్ 43.29. స్ట్రైక్ రేట్ 154.40గా నమోదు చేశాడు.
బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా..2016లో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్లో నివసిస్తోన్నారు. కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై పలు కేసులను నమోదు చేసింది. ఆయనను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. చాలావరకు స్థిర, చరాస్తులను బ్యాంకులు వేలం వేశాయి.