యూఏఈ-అమెరికా మ్యాచ్కు రిఫరీగా:
ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 టోర్నీలో భాగంగా యూఏఈ వేదికగా ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్ల మధ్య జరిగే మ్యాచ్కు జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ క్రోతో కలిసి ఈ ఏడాది పురుషుల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్కు లక్ష్మి అఫీషియల్గా బాధ్యతలు నిర్వహించారు.
2008-09లో కెరీర్ ఆరంభం:
జీఎస్ లక్ష్మి 2008-09లో మ్యాచ్ రెఫరీ కెరీర్ను ప్రారంభించారు. మొదటిసారి దేశవాళీ మహిళా క్రికెట్ మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 3 మహిళల వన్డేలకు, 7 టీ20 మ్యాచ్లకు పనిచేశారు. ఇక 16 అంతర్జాతీయ పురుషుల టీ20లకు కూడా ఆమె రెఫరీగా వ్యవహరించారు.
ఎంతో గర్వంగా ఉంది:
పురుషుల వన్డేకు మ్యాచ్ రెఫరీగా వ్యవహరించనుండడం గొప్ప అనుభూతి అని లక్ష్మి చెప్పారు. 'ఈ అవకాశం రావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎంతో గర్వంగా కూడా ఉంది. ఏదైనా మనతోనే మొదలైంది అని చెప్పుకోవడంలో ఓ ఆనందం ఉంటుంది. పలువురు మహిళలు రెఫరీ బాధ్యతల్లోకి వస్తారనుకుంటున్నా. ఐసీసీ టోర్నీలకు పనిచేయడం గొప్పగా ఉంటుంది' అని లక్ష్మి పేర్కొన్నారు.