ముంబై: శ్రీలంకలో చోటు చేసుకుంటోన్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్లు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తమ దేశం ఈ స్థాయికి దిగజారిందంటూ ధ్వజమెత్తుతున్నారు. నిరసనకారులపై కాల్పులకు తెగబడటాన్ని తప్పుపడుతున్నారు. సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వానికి చివరికి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందంటూ మండిపడుతున్నారు.
ఐపీఎల్లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు.. తమ దేశంలో చోటు చేసుకుంటోన్న తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ప్రధాని నివాసాన్ని తగులబెట్టారు. కొందరు మాజీ మంత్రుల నివాసాలకూ నిప్పంటించారు.
ఈ పరిణామాలపై రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కోచ్లు కుమార సంగక్కార, మహేల జయవర్దనె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే మహీంద రాజపక్స వర్గీయులు మహిళా ఆందోళనకారులపై అమానవీయంగా దాడులు చేశారని వారు పేర్కొన్నారు. తమ ప్రాథమిక హక్కుల కోసం ఉద్యమిస్తోన్న వారిని ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిణామాలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో ఆడుతున్న స్పిన్నర్ వనిందు హసరంగ, బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆందోళనకారులపై మహీంద రాజపక్స వర్గీయులు దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ కాల్పుల్లో మరణించిన వారి ప్రతి కుటుంబానికి తన అండదండలు ఉంటాయని హసరంగ అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా ఆరోపించారు డిక్వెల్లా.