చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) నూతన అధ్యక్షురాలిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్ ఎన్నికయ్యారు. అయితే రూప గురునాథ్ ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారంతో నామినేషన్ గడువు ముగిసింది. అధ్యక్ష పదవికి రూప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. అధ్యక్ష పదవితో పాటు సంఘంలోని ఇతర పదవులు శ్రీనివాసన్ వర్గానికే దక్కాయి.
IND vs SA: కొంచెం బుర్ర వాడి బంతులేయి.. బౌలర్పై రోహిత్ అసహనం (వీడియో)
టీఎన్సీఏ ఉపాధ్యక్షులుగా టీజే శ్రీనివాస్ రాజ్ (సిటీ), డా.పి అశోక్ సిగమణి (జిల్లాలు), సెక్రటరీగా ఆర్ఎస్ రామసామి, జాయింట్ సెక్రటరీగా కేఏ శంకర్, సహ కార్యదర్శిగా ఎన్.వెంకట్రామన్, కోశాధికారిగా జె.పార్థసారథిలు ఎన్నికయ్యారు. రూపా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. బీసీసీఐ అనుబంధ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయిన తొలి మహిళగా రూపా గురునాథ్ నిలిచారు. ఈ రోజు జరిగే సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
భారత క్రికెట్ను ఎన్.శ్రీనివాసన్ ఎంతో ప్రభావితం చేశారు. ఐతే ఫిక్సింగ్, పలు వివాదాల నేపథ్యంలో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఇక బీసీసీఐ సంబంధిత ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. క్రికెట్ వ్యవహారాల్లో తన మార్క్ చూపించడానికి కూతురు రూప గురునాథ్ను రంగంలోకి దింపాడు.
బీసీసీఐ అనుబంధ సంఘాలలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్పై మళ్లీ తన ఆధిపత్యం చెలాయించాలని శ్రీనివాసన్ చూస్తున్నాడు. అందుకే తన వారసురాలిగా రూప గురునాథ్ను టీఎన్సీఏ నూతన అధ్యక్షురాలిగా ఎంపికయేందుకు పావులు కదిపాడు. ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా శ్రీనివాసన్దే అన్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్.
బీసీసీఐ ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 22న కాకుండా.. ఒక రోజు ఆలస్యంగా అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది.