నాటింగ్హామ్: జట్టులో పూజారా.. స్థానం గురించి ప్రశ్నించిన అందరికీ తగిన సమాధానం చెప్పాడని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ మాటలను బలపరస్తూ పూజారా మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్లో పరుగులు చేసేందుకు తీవ్ర ఒత్తిడికి గురైన మాట నిజమేనని టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ ఫుజారా అన్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటం వల్లే తనకు ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపాడు.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పుజారా విలువైన 72 పరుగులు చేసి కోహ్లీతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 'పూజారాకు టెస్టుల్లో ఆడటం కంటే ముందు కౌంటీ క్రికెట్ ఆడటం కలిసొచ్చింది. ఇక్కడ నేనెంతో నేర్చుకున్నా. కౌంటీలో భారీ స్కోర్లు సాధించకున్నా సవాల్ విసిరే పిచ్లపై ఆడటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నెట్స్లో సాధన చేయడం, టైమింగ్ చూసుకోవడం ఎప్పటికైనా మంచి చేస్తుంది. '
'పరుగులేమీ చేయనప్పుడు ఆటగాడిపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మూడో టెస్టుకు ముందు మేమంతా కలిసి భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాం. జట్టుకు అవసరమైనప్పుడు 50లు, 100లే కాదు 30, 40 పరుగులు చేయడమూ కీలకమే. ప్రస్తుత టెస్టు రెండు ఇన్నింగ్సుల్లో 50 పరుగుల భాగస్వామ్యం లేకుండా వికెట్ చేజార్చుకోలేదు. గత మ్యాచ్ల గురించి ఆలోచించడం లేదు. ఈ టెస్టులో భారీ పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. బ్యాట్స్మెన్ ఎక్కడ ఆడినా టెక్నిక్ చాలా ముఖ్యం. సహజశైలిలో ఆడాల్సి ఉంటుంది.'
'అండర్సన్ను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. 2014 పర్యటనలో అతడిని ఎదుర్కొన్న అనుభవం ఉంది. అతడి బౌలింగ్లో ఎలా ఆడాలన్న ప్రణాళిక నాకుంది. అతడు ఎక్కడ బంతులు విసురుతాడో తెలుసు. ఇంగ్లాండ్లో ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాల్తో కూడుకున్నదే. ప్రస్తుత వాతావరణం బౌలర్లకు అనుకూలంగా ఉంది' అని పుజారా వెల్లడించాడు.