ధోనీకి చోటు కల్పించలేదు:
ఇంతకు ఏం జరిగిందంటే.. అన్నీ కుదిరి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే ఈ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. 14 మంది జట్టు సభ్యులలో ఎంఎస్ ధోనీకి చోటు కల్పించలేదు. అంతేకాకుండా వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేశాడు. ఎంఎస్ ధోనీకి జట్టులో చోటు కల్పించకపోవడంతో.. మహీ అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఫాన్స్ తమకిష్టమొచ్చిన పదాలను ఉపయోగించారు. దీంతో బయపడిపోయిన ఆకాష్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.
నన్ను క్షమించండి:
తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్తో జరిగిన చాట్లో ఆకాష్ చోప్రా పాల్గొని ఎంఎస్ ధోనీ అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. 'కొందరు నన్ను, నా పిల్లలను ఇష్టమొచ్చిన విధంగా తిడుతున్నారు. దీంతో సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన విషయాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి' అంటూ మహీ అభిమానులను ఆకాశ్ కోరాడు. దీంతో ఈ ఎపిసోడ్ దాదాపు సుఖాంతమైనట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆకాష్ చోప్రా భారత్ తరపున 10 టెస్టులు ఆడి..437 పరుగులు చేసాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ధోనీ రీఎంట్రీ ఐపీఎల్పై ఆధారపడి లేదు:
ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్ ప్రదర్శనకు అసలు సంబంధమే లేదని ఇటీవలే ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ధోనీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేది ఐపీఎల్పై ఆధారపడి లేదు. టీమ్ మేనేజ్మెంట్ అతడి సేవలను వినియోగించుకోవాలని అనుకుంటే తప్పకుండా ధోనీ తిరిగి జట్టుకు ఎంపికవుతాడు. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచకప్ జరుగకపోయినా.. మహీకి వచ్చిన నష్టమేమీ లేదు' అని చోప్రా అన్నాడు. ఒకవేళ ధోనీ కెరీర్లో వరుసగా 18 నెలల పాటు గ్యాప్ వచ్చినట్లయితే.. అతనింకా టీమిండియా తరపున ఆడబోడని అనుకోవచ్చని పేర్కొన్నాడు.
ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్:
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.