|
ధోనీ ఆటను వీక్షించేందుకు ఆసక్తిగా ఉన్నా:
ఐపీఎల్ 2020 ఆరంభమవుతుందని ప్రకటించిన వెంటనే క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేసింది. సిక్సర్ల జోరు, బౌండరీల హోరు, ఉత్కంఠ రేపే మ్యాచులను తిరిగి చూడబోతున్నామని సందడి చేస్తున్నారు. వీరికి మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడల ఆటగాళ్లూ తోడయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్జ రుగుతుందని ప్రకటించిన వెంటనే భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ స్పందించాడు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఆటను వీక్షించేందుకు ఆత్రుతగా ఉన్నానన్నాడు. 'ఐపీఎల్ 2020 జరుగుతుండటం గొప్ప విషయం. ఎంఎస్ ధోనీ ఆటను మళ్లీ వీక్షించేందుకు ఆసక్తిగా ఉన్నా' అని ట్వీట్ చేశాడు.
ఆగలేకపోతున్నా:
చెన్నై సూపర్కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్ 2020 జరగడం లాంఛనమే. ఉత్సాహపరిచే షెడ్యూలు ఉండబోతోంది. అయితే నిబంధనలు, ఆంక్షలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ క్రికెట్కు ఇది శుభవార్త. ఐపీఎల్ కోసం ఎదురుచూసేందుకు ఆగలేకపోతున్నా' అని ట్వీట్ చేశాడు. 'అతి త్వరలో ఐపీఎల్ 2020 ఉంది. అదే ఉత్సాహం.. అదే అభిరుచి.. అదే తీవ్రత.. ది ఛాలెంజర్ స్పిరిట్. దూకుడుగా ఆడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తోంది. మీరంతా మాతో ఉన్నారా?' అని ఆర్సీబీ పేర్కొంది.
ఆస్ట్రేలియా పర్యటన కారణంగా:
సెప్టెంబర్ 26న ఐపీఎల్ సీజన్ను ప్రారంభించాలని తొలుత బీసీసీఐ ప్రాథమిక షెడ్యూల్ను అనుకుంది. అయితే డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో భారత పర్యటన ఉండడం.. తమ దేశానికి వచ్చే ఆటగాళ్లకు 14రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ఆ దేశ క్రికెట్ బోర్డు చెప్పడంతో షెడ్యూల్ను ఓ వారం ముందుకు జరిపింది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాలను ఈ సీజన్కు వేదికలుగా నిర్ణయించారు. శని, ఆదివారాల్లో మొత్తం 12 డబుల్ హెడర్స్ (ఒకేరోజు రెండుమ్యాచ్లు) ఉండనున్నాయి.
సెప్టెంబర్ 19 నుంచి లీగ్:
'పాలక మండలి త్వరలోనే సమావేశమవుతుంది. అయితే మేం ఇప్పుడే షెడ్యూల్ను ఖరారు చేశాం. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు జరుగుతుంది. ప్రభుత్వ అనుమతి లభిస్తుందని మేం నమ్ముతున్నాం. ఈసారి 51రోజుల పాటు ఐపీఎల్ను పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం' అని చైర్మన్ బ్రిజేశ్ పటేల్ శుక్రవారం వెల్లడించాడు. కరోనా వైరస్ ప్రమాదం లేకుండా ఐపీఎల్ జరిపేందుకు పక్కాగా ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్వోపీ) రూపొందిస్తున్నామని, పూర్తయ్యాక యూఏఈ బోర్డుకు లేఖరాస్తామని చెప్పాడు. ఇక మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనే విషయం అక్కడి ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని బ్రిజేశ్ చెప్పాడు.
వెస్టిండీస్తో మూడో టెస్టు.. ఆదుకున్న పోప్, బట్లర్.. ఇంగ్లండ్ 258/4