పుజారా ఇంటర్వ్యూ
సరిగ్గా 39 సంవత్సరాల క్రితం వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఫిబ్రవరి 21న రవిశాస్త్రి టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం చేశారు. అప్పుడు రవిశాస్త్రి వయసు 19 ఏళ్లు. 151వ నంబర్ గల టోపీని తన కెప్టెన్ నుండి అందుకున్నారు. ఆ విషయాన్ని శాస్త్రి అభిమానులతో పంచుకున్నారు. రవిశాస్త్రిని టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ ఛతేశ్వర పుజారా ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇదే మైదానం.. ఇదే జట్టు
ఛతేశ్వర పుజారాతో రవిశాస్త్రి మాట్లాడుతూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. '39 సంవత్సరాలు గడిచాయి. మనం ఏమిస్తే తిరిగి మనకదే దక్కుతుందని అంటారు. ఇదే రోజు (శుక్రవారం) ఇదే మైదానం.. ఇదే జట్టు.. ఇదే నగరంలో 39 ఏళ్ల క్రితం టెస్టుల్లో అరంగేట్రం చేశాను. నమ్మలేకుండా ఉంది. మళ్లీ ఈ వేదికకు వస్తాననుకోలేదు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి చూసాను. ఇప్పటికీ మార్పులేదు' అని రవిశాస్త్రి అన్నారు.
మొదటగా ఫీల్డింగ్ చేశా
మ్యాచ్కు ముందు రోజు న్యూజిలాండ్కు ఎలా వచ్చారని పుజారా అడగ్గా... 'విమానాశ్రయానికి నా కోసం స్వర్గీయ బాపూ నాడ్కర్ణి వచ్చారు. నేరుగా హోటల్కు వెళ్లా. నా రూమ్మేట్ దీలీప్ వెంగ్ సర్కార్. తెల్లారి నేరుగా మైదానంకు వెళ్ళాను. కెప్టెన్ సునీల్ గవాస్కర్ టాస్ ఓడిపోవడంతో మొదటగా ఫీల్డింగ్ చేశా. తొలి మ్యాచ్ అయినా ఎలాంటి నెర్వస్ లేకుండా బౌలింగ్ చేశా. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జెరేమీ కోనీ వికెట్ తీశా. దాంతో నాలో మరింత విశ్వాసం పెరిగింది' అని తెలిపారు.
|
దిలీప్ గాయపడడంతో చోటు
'ఇండియాలో కన్నా ఇక్కడ పరిస్థితులు పూర్తి బిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కన్నా ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంటుంది. గాలులు వీస్తుంటాయి. ఆ రోజు కూడా చల్లని గాలులు వీచాయి. దీంతో పాలీ ఉమ్రిగర్ నాకు స్వేటర్ ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. దిలీప్ గాయపడడంతో.. ముంబై తరఫున కాన్పూర్లో రంజీ క్వార్టర్స్ ఆడుతున్న రవిశాస్త్రికి టీమిండియా నుండి కబురు అందింది. ముంబై జట్టు బస చేసిన అతిథి గృహం కాపలదారు జాతీయ జట్టుకు ఎంపికైన విషయాన్ని శాస్త్రికి చెప్పారు.
|
తొలి మ్యాచ్లో వికెట్లు:
తొలి మ్యాచులో ఆల్రౌండర్గా రవిశాస్త్రి ఆకట్టుకున్నారు. పదో స్థానంలో బ్యాటింగ్కు దిగి 3 (17 బంతుల్లో), 19 (54 బంతుల్లో) పరుగులు చేశారు. ఇక స్పిన్నర్గా ఆరు వికెట్లు సాధించారు. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 3/54, రెండో ఇన్నింగ్స్లో 3/9తో రాణించారు. అయితే ఈ మ్యాచులో భారత్ 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత ప్రదర్శనతో శాస్త్రి 11 ఏళ్లు భారత జట్టు తరఫున ఆడారు. ప్రస్తుతం కోచ్గా కూడా జట్టుతోనే ఉన్నారు.