హైదరాబాద్: శ్రీలంక ప్రముఖ క్రికెటర్లంతా ఒకే ఒరవడి కొనసాగిస్తున్నారు. క్రికెట్ తర్వాత రాజకీయరంగాన్ని ఎంచుకున్న శ్రీలంక స్టార్ క్రికెటర్లు అర్జున్ రణతుంగ, సనత్ జయసూర్యల సరసన మరొక క్రికెటర్ చేరాడు. లంక బ్యాట్స్మెన్లలో అరుదైన బ్యాట్స్మెన్గా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిన తిలకరత్నే దిల్షాన్... మహీంద రాజపక్స కొత్తగా ఏర్పాటు చేసిన 'శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్'లో సభ్యత్వం తీసుకున్నాడు.
దిల్షాన్ సభ్యత్వం తీసుకుంటున్న ఫొటోను ఆ పార్టీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ విషయంపై దిల్షాన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీలంకలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. అంతకుముందు వరకు ప్రధానిగా ఉన్న విక్రమ సింఘను దేశాద్యక్షుడు మైత్రిపాల సిరిసేన పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రాజపక్సను ప్రధానిగా ఎంపిక చేశారు. మెజారిటీ లేకపోవడంతో ఆయన విశ్వాస పరీక్షకు వెళ్లలేదు. పార్లమెంటును అధ్యక్షుడు రద్దుచేశారు. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం దీనిపై ఎలాంటి నిర్క్షయం తీసుకోలేదు. .
'దిల్స్కూప్' షాట్తో ఫేమస్ అయిన దిల్షాన్ 2016లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మొత్తం 330 వన్డేల్లో 10,290 పరుగులు, 87 టెస్టుల్లో 5492 రన్స్ చేశాడు. 39 వికెట్లు తీసి 1,711 పరుగులు ఇచ్చారు. శ్రీలంకలో అర్జున రణతుంగ, సనత్ జయసూర్య వంటి వారు మంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు గందరగోళం మారాయి.