మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పాకిస్థాన్.. టీ20ల్లోనూ అదే ప్రదర్శన కొనసాగించింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (66; 33 బంతుల్లో 6x4, 4x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ మలన్ (54 నాటౌట్; 36 బంతుల్లో 6x4, 1x6) అర్ధ సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్ సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు సాధించింది. ఓపెనర్లు బాబర్ ఆజామ్ (44; 56 బంతుల్లో 7x4), ఫకర్ జామన్ (36; 22 బంతుల్లో 5x4, 1x6) మంచి ఆరంభాన్ని అందించారు. ఈ జోడి తొలి వికెట్కు 8.3 ఓవర్లనే 72 పరుగులు జత చేసింది. ధాటిగా ఆడే క్రమంలో ఫకర్ పెవిలియన్ చేరాడు. అనంతరం మొహమ్మద్ హఫీజ్ అండతో బాబర్ హాఫ్ సెంచరీ బాదాడు. ఇక టీ20ల్లో వేగంగా (39 ఇన్నింగ్స్ల్లో) 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ సరసన బాబర్ నిలిచాడు.
బాబర్, హఫీజ్ ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును 100 దాటించారు. వేగంగా ఆడే క్రమంలో బాబర్ ఔట్ అయ్యాడు. బాబర్ అనంతరం హఫీజ్ బౌండరీలతో చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతనికి షోయబ్ మాలిక్ అండగా నిలిచాడు. హఫీజ్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. మాలిక్ ఔట్ అయినా.. హఫీజ్ జోరు కొనసాగించాడు. చివరకు 69 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇఫ్తీఖర్ అహ్మద్ (8), షాదాబ్ ఖాన్ (0) నాటౌట్గా ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో అదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు జానీ బెయిర్స్టో (44), టామ్ బాంటన్ (20) తొలి వికెట్కు 6.2 ఓవర్లనే 66 పరుగులు జత చేసి ఇంగ్లండ్కు శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ వెనుదిరిగినా.. మోర్గాన్, మలన్ మూడో వికెట్కు 112 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపారు. 17 పరుగుల తేడాతో 3 వికెట్లు పడడంతో కొంత ఉత్కంఠ నెలకొన్నా.. మలాన్ జోరు కొనసాగించి ఇంకో 5 బంతులుండగానే జట్టును గెలిపించాడు. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.