

హైదరాబాద్: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్కు చెందిన పాపులర్ క్రికెట్ ఫ్యాన్ క్లబ్ బార్మీ ఆర్మీ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు.
గురువారం కోహ్లీసేన ఎసెక్స్ జట్టుతో వార్మప్ మ్యాచ్లో తలపడటానికి ముందు ఎసెక్స్ క్రికెట్ క్లబ్లో బార్మీ ఆర్మీ టూర్ మేనేజర్, మెంబర్షిప్ సెక్రటరీ ఆండీ థాంప్సన్ కోహ్లీకి ఈ అవార్డుని అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
గతేడాది కోహ్లీపై ఈ ఫ్యాన్ క్లబ్ ఒక వీడియోను కూడా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎసెక్స్తో మూడు రోజుల మ్యాచ్లో భారత్ తడబడి నిలబడింది. దినేశ్ కార్తీక్ (82 బ్యాటింగ్) బ్యాట్తో రాణించడంతో తొలి రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 322 పరుగులు సాధించింది.
విరాట్ కోహ్లి (68), కేఎల్ రాహుల్ (58), మురళీ విజయ్ (53) హాఫ్ సెంచరీలు సాధించారు. దినేశ్ కార్తీక్కు తోడుగా హార్దిక్ పాండ్యా (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత జట్టు ఓపెనర్ ధావన్ ఖాతా అయినా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
కోల్ బౌలింగ్లో అతడు వికెట్ కీపర్ ఫాస్ట్ర్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కోల్ ఆ తర్వాతి ఓవర్లో పుజారా (1)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానె (17) క్విన్ బౌలింగ్లో జట్టు స్కోరు 44 పరుగులు వద్ద మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ అలవోకగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు.
అదే సమయంలో మరో ఎండ్లో ఉన్న మురళీ విజయ్ కూడా కోహ్లీకి మద్దతుగా నిలబడటంతో భారత్ ఒకానొక దశలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత విజయ్, కోహ్లీ 13 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో 147/5తో కష్టాల్లో పడింది. ఆ దశలో దినేశ్ కార్తీక్ జట్టును ఆదుకున్నాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి జట్టు స్కోరుని పెంచాడు. అదే సమయంలో కార్తీక్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. జట్టు స్కోరు 261 వద్ద రాహుల్ ఔటైనా కార్తీక్ జోరు తగ్గలేదు. రాహుల్తో ఆరో వికెట్కు 114 పరుగులు జోడించిన కార్తీక్.. అనంతరం క్రీజులోకి వచ్చిన పాండ్యాతో ఏడో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.