నాలుగో స్థానంలో ఆడేదెవరనేది ప్రశ్న:
గత ఇరవై టీ20ల్లో 15 మ్యాచ్ల్లో టీమిండియాదే విజయం. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20ల్లోనూ విరాట్ సేనదే పైచేయి. రెండింట్లోనూ భారీ ఆధిక్యాలతో గెలుపొందిన టీమిండియాకు.. ఐర్లాండ్ సిరీస్ సన్నాహకంగా పనికొచ్చింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యర్థి బంగ్లాదేశో, అఫ్గానిస్తానో కాదు. పటిష్ట ఇంగ్లండ్. అందుకే భారత్ ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయి జట్టుతో సన్నద్ధమైంది. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేదే ఆసక్తికరం.
పటిష్ఠమైన టాప్ ఆర్డర్తో టీమిండియా:
గడిచిన సిరీస్లో టాప్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంతా పరుగులు రాబట్టారు. రోహిత్, ధావన్, రాహుల్, రైనా, పాండ్యా బ్యాటింగ్లో ఆకట్టుకున్నారు. బౌలింగ్లో బుమ్రా, ఉమేశ్, చాహల్, కుల్దీప్ మెరిశారు. మెడ నొప్పితో ఆటకు దూరమై.. తిరిగి జట్టులోకొచ్చిన కోహ్లి 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. ఐతే అతడి సామర్థ్యంపై సందేహాల్లేవు. అతను గాడిన పడటానికి ఒక్క ఇన్నింగ్స్ చాలన్నది విశ్లేషకుల అంచనా. రోహిత్, ధావన్, కోహ్లి, కేఎల్ రాహుల్, రైనా, ధోనీలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా ఉంది.
పాండే, దినేశ్ కార్తీక్లలో ఒక్కరికే:
రాహుల్ను స్పెషలిస్ట్ ఓపెనర్గానే పరిగణిస్తే మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జట్టులో ధోనీలాంటి వికెట్ కీపర్, అత్యుత్తమ ఫినిషర్ ఉన్న నేపథ్యంలో పాండే వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. గాయం కారణంగా బుమ్రా సిరీస్కు దూరం కావడంతో అతని స్థానంలో చాహర్ను ఎంపిక చేసినా... అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువే. భువనేశ్వర్తో పాటు ఉమేశ్ను ఆడించే అవకాశాలే ఎక్కువ.
చాహల్, కుల్దీప్లకు చోటు దక్కొచ్చు
ప్రస్తుతం ఇంగ్లాండ్లో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కొచ్చు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, పేసర్లు భువనేశ్వర్, ఉమేశ్యాదవ్ మిగతా స్థానాల్ని భర్తీ చేస్తారు. ఇక సొంతగడ్డపై 5 వన్డేలు, ఏకైక టీ20లో ఆసీస్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కాబట్టి ఆతిథ్య జట్టును ఓడించడం భారత్కు అంత తేలికేమీ కాదు.
బ్యాటింగ్ నే నమ్ముకున్న ఇంగ్లాండ్
బ్యాటింగే ప్రధాన బలంగా ఇంగ్లండ్ బరిలో దిగనుంది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేసిన మోర్గాన్ సేన ఏకైక టి20లోనూ జయభేరి మోగించింది. బట్లర్, రాయ్, బెయిర్స్టో, మోర్గాన్, హేల్స్, రూట్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్-11 ఫామ్ను కొనసాగిస్తున్న బట్లర్ ఓపెనర్ అవతారం ఎత్తి జట్టు భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్లో ఓపెనర్గా బరిలో దిగిన అతను తొలి మ్యాచ్లోనే తమ దేశం తరఫున వేగవంతమైన 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా రికార్డులకెక్కాడు.
తుది జట్లు (అంచనా):
భారత్:
కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, ధోని (వికెట్ కీపర్), మనీష్ పాండే/ రాహుల్, హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్
ఇంగ్లాండ్:
మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, హేల్స్, రూట్, బెయిర్స్టో (వికెట్ కీపర్), విల్లీ, ప్లంకెట్, మొయిన్ అలీ, రషీద్, జోర్డాన్