ఇస్లామాబాద్: వచ్చేనెల టీ20 ప్రపంచకప్ ఆరంభం కాబోతోంది. ఈ సారి ఆస్ట్రేలియా దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మెగా ఈవెంట్ ముందున్న నేపథ్యంలో - అందులో ఆడబోయే జట్లన్నీ ప్రస్తుతం టీ20 సిరీస్లో బిజీగా గడుపుతోన్నాయి. ఆస్ట్రేలియా.. భారత పర్యటనకొచ్చింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసిపోయాయి. తలో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్లో సమంగా నిలిచాయి ఈ రెండ జట్లు. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లో షెడ్యూల్ అయింది.
మరోవంక- ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తోంది. ఏకంగా ఏడు టీ20 మ్యాచ్లు ఈ రెండు జట్ల మధ్య జరుగనున్నాయి. 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యతను సాధించింది. కరాచీలో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా 63 పరుగులతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లల్లో 221 పరుగులు చేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది.
ఈ మ్యాచ్లో విల్ జాక్స్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ రెచ్చిపోయి ఆడారు. విల్ జాక్స్ 22 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 40 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్తో 70 పరుగులతో చివరి వరకూ నిలిచాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 35 బంతుల్లోనే 81 పరుగులతో పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తన ఇన్నింగ్లో హ్యారీ బ్రూక్ అయిదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లను పిండుకున్నాడు.
ఈ ఇద్దరినీ పాకిస్తాన్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. 82 పరుగుల వద్ద మూడో వికెట్ను పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్లు.. ఇక మరో వికెట్ తీయలేకపోయారంటే హ్యారీ బ్రూక్-బెన్ డకెట్ ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. పాక్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రత్యేకించి- షానవాజ్ దహాని. అతని నాలుగు ఓవర్లల్లో 62 పరుగులు రాబట్టుకున్నారు. ఓవర్కు 15కు పైగా పరుగులు పిండుకున్నారు. ఉస్మాన్ ఖాదిర్ రెండు వికెట్లు పడగొట్టాడన్న మాటే గానీ నాలుగు ఓవర్లల్లో 48 పరుగులు ఇచ్చాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కనీసం ఆ ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించలేదు. 158 పరుగుల వద్దే నిలిచిపోయింది దాని ప్రస్థానం. టాప్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ ఒక్కడే 65 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో ఖుష్దిల్ షా-29, మహ్మద్ నవాజ్-19 పరుగులు చేశారంతే. మహ్మద్ రిజ్వాన్-8, బాబర్ ఆజమ్-8, హైదర్ అలీ-3, ఇఫ్తికర్ అహ్మద్-6, ఉస్మాన్ ఖాదిర్, హ్యారిస్ రవూఫ్-4 పరుగులు చేశారు.