లండన్: టెస్ట్ క్రికెట్ సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. క్రికెట్ మక్కాగా చెప్పుకొనే లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత కాలమానం ప్రకారం..ఈ మధ్యాహ్నం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభమౌతుంది. ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఆడనున్న న్యూజిలాండ్.. అంతకంటే ముందే రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది. న్యూజిలాండ్కు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. జో రూట్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ ఆడబోతోంది.
ఈ సిరీస్తో కేన్ విలియమ్సన్ బిజీ కానున్నాడు. రెండు టెస్టులతో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ను ఢీ కొట్టనున్నాడు. ఈ 20 రోజుల వ్యవధిలో మూడు టెస్టులను ఆడబోతోన్నాడు కేన్ మామ. దీని తరువాత న్యూజిలాండ్ తరఫున డొమెస్టిక్, ఇంటర్నేషనల్స్, కౌంటీల్లో ఆడతాడు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగే ఐపీఎల్ 2021 ఫేస్ 2 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నేతృత్వం వహిస్తాడు.
ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందే కేన్ విలియమ్సన్ విలేకరులతో మాట్లాడాడు. జో రూట్ కేప్టెన్సీలోని ఇంగ్లాండ్ టెస్ట్ ఫార్మట్ టీమ్ బలంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఈ రెండు టెస్టులూ తమకు అగ్నిపరీక్షగా మారుతాయని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కేప్టెన్సీలోని టీమిండియాను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఢీ కొట్టడానికి ముందు- ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనడం తమకు లాభిస్తుందని కేన్ విలియమ్సన్ చెప్పాడు.
ఆధునిక క్రికెట్ను జీవింపజేసే సత్తా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి క్రికెటర్లకు ఉందని కేన్ చెప్పాడు. ఈ ముగ్గురి క్రికెట్ను తాను ఆరాధిస్తానని అన్నాడు. కోహ్లీ-స్మిత్-జో రూట్.. ముగ్గురికీ ముగ్గురేనని, ఆటలో పూర్తి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తారని అన్నాడు. మరొకరికి సాధ్యం కాని క్రికెటింగ్ షాట్లను ఆడటంలలో ఈ ముగ్గురికీ తిరుగులేదని చెప్పుకొచ్చాడు. సమకాలీన క్రికెట్ను కోహ్లీ వంటి క్రికెటర్లు శాసిస్తున్నారని అన్నాడు. ఆధునిక క్రికెట్పై వారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు.