ఐసీసీ రూల్స్:
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ ఆటలో తాత్కాలిక నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మి (సలైవా)పై నిషేధం, ద్వైపాక్షిక సిరీస్లను స్థానిక అంపైర్లతో నిర్వహించడం, టెస్టుల్లో కొవిడ్-19 సబ్స్టిట్యూట్, టెస్టుల్లో మూడు డీఆర్ఎస్ రివ్యూలు, వన్డే-టీ20లకు రెండు రివ్యూలు, టెస్టు జెర్సీపై అదనపు లోగో వంటి కొత్త రూల్స్ ఐసీసీ తీసుకొచ్చింది. వీటన్నింటిని ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్లో అమలు చేస్తున్నారు.
బంతికి ఉమ్మి రాసిన సిబ్లే:
ముఖ్యంగా ఆటగాళ్లు బంతిని ఉమ్మితో శుభ్రం చేయడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే ఈ నిబంధనలను తొలిసారిగా ఇంగ్లండ్ ఆటగాడు డామ్ సిబ్లే అతిక్రమించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్ 4వ రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగో రోజు లంచ్కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే.. బంతి సిబ్లే చేతికొచ్చింది. ఇక ఓవర్ వేసేందుకు స్పిన్నర్ డామ్ బెస్ సిద్దమవుతున్నాడు. ఈ సమయంలో సిబ్లే అనుకోకుండా ఉమ్మితో బంతిని శుభ్రం చేశాడు. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు విషయాన్ని అంపైర్లకు తెలియజేశారు. అంపైర్ మైకేల్ గాఫ్.. బంతిని శానిటైజర్ టవల్తో శుభ్రంచేసి బెస్కు అందించాడు.
అదేపనిగా ఉమ్మి రుద్దితే:
ఉమ్మి నిబంధనకు ఆటగాళ్లు ఇంకా అలవాటు పడలేదన్న విషయం ఈ ఘటనతో రుజువైంది. అయితే మిగతా దేశాల్లో కూడా క్రికెట్ ప్రారంభమైతే ఇంకెంతమంది ఆటగాళ్లు ఇలా చేస్తారోనని క్రికెట్ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు. టెస్టుల్లో బౌలర్లు బంతిపై ఉమ్మి ఉపయోగిస్తే.. అలవాటు పడే వరకు అనుమతిస్తారు. అయితే అదేపనిగా ఉమ్మిని వాడితే.. ఇన్నింగ్స్కు రెండు సార్లు హెచ్చరిస్తారు. అప్పటికీ సదరు ఆటగాడిలో మార్పు రాకుంటే..పెనాల్టీ కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు జతచేస్తారు. అంటే బౌలింగ్ చేసే జట్టు అందనంగా 5 రన్స్ ఇచ్చుకోవడమే.
సిబ్లే సెంచరీ:
డామ్ సిబ్లే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (120) చేశాడు. అయితే వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ టెస్టులో నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్లో రెండు వికెట్లకు 37 పరుగులు చేసింది. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 287 రన్స్కు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ను 469/9 వద్ద ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది. తొలి టెస్టును విండీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.