
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించింది. తాజాగా ఆమ్రపాలీ రియల్ ఎస్టేట్ సంస్థ తనను మోసం చేసిందని ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2009 నుంచి 2016 వరకు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఆమ్రపాలి గ్రూప్ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు.
మరోవైపు రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్హౌస్ను తాను బుక్ చేసుకున్నానని.. ఇంతవరకూ పెంట్హౌస్ను తనకు అప్పగించలేదని పిటిషన్లో ధోనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధోనీతో జరిగిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని ఈ రోజు సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించింది.
ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నఆమ్రపాలి గ్రూప్పై గృహాల కొనుగోలుదారులు కూడా చాలా మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గృహాల కోసం తాము అడ్వాన్స్లు చెల్లించినా.. తమకు ఇంతవరకు ఇళ్లను ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. కాగా.. గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుతో నిర్మించిన ఫైవ్స్టార్ హోటల్, మాల్, కార్పొరేట్ కార్యాలయాలతో పాటు లగ్జరీ కార్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీని విక్రయించి బకాయిపడిన వారికి చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశించింది.
రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్నకు 2009-2016 మధ్య కాలంలో ధోనీ ప్రచారకర్తగా పలు ప్రకటనల్లో కనిపించాడు. అంతేగాక ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనీతో పాటు అతడి భార్య సాక్షి కూడా భాగస్వామ్యమయ్యారు. ఆమ్రపాలి గ్రూపునకు చెందిన చారిటబుల్ వింగ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సాక్షి పాల్గొన్నారు. ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి ఆ డబ్బును దారి మళ్లించినట్టు ఈ గ్రూప్పై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ గ్రూప్నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చిన నిధులను నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఉపయోగించాలని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ధోనీకి చెల్లించాల్సిన రూ. 40కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు.పెంటౌజ్ విషయంలోనూ ధోనీకి యాజమాన్య హక్కులు కల్పించలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని ఎంఎస్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.