న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు శుభ్మన్ గిల్.. మరోవైపు ఇషాన్ కిషన్తో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో శిఖర్ ధావన్ వన్డే జట్టులో కొనసాగడం కష్టంగా మారింది. కొత్త సెలెక్షన్ కమిటీ ధావన్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బలి పశువయ్యేది శిఖర్ ధావనేనని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు.
'శ్రీలంకతో జరగనున్న సిరీస్లో ధావన్కు ఏ స్థానం ఇస్తారు? ఇషాన్ కిషన్ వంటి ఆటగాడిని ఎలా తప్పిస్తారు? అదెలా చేస్తారనేది ఆసక్తికరం. శుభ్మన్ గిల్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. నాకు తెలిసి అది ధావనే అవుతాడు. అదే జరిగితే.. అతని అద్భుతమైన కెరీర్కు బాధాకరమైన ముగింపు తప్పదేమో. అయితే, ఈ విషయంలో సెలక్టర్లు స్పందించాల్సి ఉంది.' అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ముంగిట తుది జట్టులో శిఖర్ ధావన్కు చోటు దక్కడం కష్టమేనంటూ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. 'శుభ్మన్ గిల్ జట్టులో ఉంటే కచ్చితంగా ఓపెనర్గా ఆడుతాడు. ఎందుకంటే, కొంతకాలంగా అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ఇషాన్ కిషన్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గొప్పగా రాణించాడు. ఈ రెండు అంశాలు శిఖర్ ధావన్కు అవకాశాలను దూరం చేయవచ్చు'అని తెలిపాడు. శిఖర్ ధావన్ కేవలం వన్డే ఫార్మాట్లోనే ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో గబ్బర్ ధావన్ 7,8, 3 దారుణంగా విఫలమయ్యాడు.
వసీం జాఫర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్ ఫామ్ గురించి మాట్లాడుతూ..'న్యూజిలాండ్తో సిరీస్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. కొంత కాలంగా ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం, కొందరు మధ్యలోనే నిష్క్రమించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శిఖర్ ధావన్ ఫామ్ కోల్పోతే టీమ్మేనేజ్మెంట్ను మరింత అయోమయానికి గురిచేస్తుంది. ఇటీవల పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ అతను మరోసారి సత్తా చాటాలని సెలక్టర్లు భావిస్తుండవచ్చు.'అని పేర్కొన్నాడు.