హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో వన్డే ఆడేందుకు సిద్ధమైనా.. రెండో వన్డేలో ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగలేదు. ఇంగ్లాండ్తో శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 59 బంతులాడి రెండు ఫోర్లు కొట్టి 37 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో.. ఈ మేటి 'ఫినిషర్' మునుపటిలా ఆడలేకపోతున్నాడని.. రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ విమర్శకుల జాబితాలోకి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరాడు. 1975లో ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 36 పరుగులు మాత్రమే చేశాడు. చాలా కాలం తర్వాత ధోనీ ఆడిన అత్యంత ఇన్నింగ్స్లో ఇదొక దారుణమైన ఇన్నింగ్స్. తాజాగా లార్డ్స్ వేదికగానే ధోనీ విఫలమవడంతో గవాస్కర్ సరదాగా ఇలా స్పందించాడు.
'లార్డ్స్ మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ తడబాటు.. నా ప్రసిద్ధ ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చింది. మ్యాచ్లో అతని తడబాటు అర్థం చేసుకోగదిగినదే. ఎందుకంటే.. అప్పటికే మ్యాచ్లో గెలవడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. దీంతో.. బ్యాట్స్మెన్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం సహజమే. కొన్ని మంచి షాట్లు కూడా నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లడంతో డాట్బాల్స్ పెరిగాయి. క్రమంగా బ్యాట్స్మెన్పై ఒత్తిడి కూడా పెరిగింది' అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య విజేత నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం సాయంత్రం జరగనుంది. ఈ వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి ఇంగ్లాండ్ -ఇండియాల మధ్య జరగనున్న ఆఖరి సిరీస్ టెస్టు ఆగష్టు 1తో ప్రారంభం కానుంది.