
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇగో గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం కోహ్లీసేన వెస్టిండిస్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో గురువారం నుంచి తొలి టెస్టులో తలపడుతోంది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో విరాట్ కోహ్లీ పుస్తకం చదువుతూ కనిపించాడు.
సాధారణంగా విరాట్ కోహ్లీకి అహం ఎక్కువేనని క్రికెట్ అభిమానులు అంటుంటారు. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లీ స్టీవెన్ సిల్వస్టర్ రాసిన 'డిటాక్స్ యువర్ ఇగో: సెవెన్ ఈజీ స్టెప్స్ టు ఎచీవింగ్ ఫ్రీడమ్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్' అనే పుస్తకం అతడి చేతిల్లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలుగులో దీని అర్ధం ఏంటంటే 'అహం తగ్గించుకోండి: జీవితంలో స్వేచ్ఛ, ఆనందం, విజయం సాధించేందుకు తేలికైన ఏడు మెట్లు'. సాధారణంగో విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా వ్యవహారిస్తుంటాడు. దీంతో కోహ్లీ ఈ పుస్తకం చదువుతుండటం నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్లో జోకులు కూడా పేలుతున్నాయి.
'ఇగో టైటిల్ ఉన్న పుస్తకాన్ని కోహ్లి చదువుతున్నాడు చూశారా' అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ 'చివరకు కోహ్లికి డిటాక్స్ యువర్ ఇగో అనే పుస్తకం అవసరమైంది' అని ట్వీట్ చేశాడు. ఇంకొకరు ' టీమిండియా కోచ్ పదవి కోసం పోటీపడ్డ మైక్ హెసన్ చివరికి ఆర్సీబీ డైరక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పదవీ పగ్గాలు చేపట్టనున్నాడని ఈ పుస్తకం చదువుతున్నావా?' అంటూ సెటైర్ వేశాడు.