
హైదరాబాద్: భారీ అంచనాలతో మొదలుపెట్టిన ఐపీఎల్ 11వ సీజన్ మాకు చేదు అత్యంత చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందని రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పేలవ ప్రదర్శనతో నాకౌట్కు చేరలేకపోయిన తమను అభిమానులు క్షమించాలని కోరాడు. ఇది తమకు ఒక గుణపాఠంగా మిగిలిపోతుందని కోహ్లి పేర్కొన్నాడు. ప్రస్తుత తప్పుల నుంచి రాటుదేలి వచ్చే సీజన్లో సత్తాచాటుతామనే ధీమా వ్యక్తం చేశాడు.
'మేము పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయాం. ఈ సీజన్ చాలా గడ్డుకాలంగా నడిచింది. అందరూ ఊహించినంతగా, మేము అనుకున్నంత స్థాయిలోనూ ప్రదర్శన చేయలేకపోయాం. మొత్తంగా ఈ సీజన్ ఎప్పటికీ మరచిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. మేము ఆడిన విధానం నన్ను చాలా బాధించింది. మాపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టలేదు. అందుకు వారంతా మమ్మల్ని క్షమించాల్సి ఉంది.' అని చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'ఈ సీజన్కు ఓడిపోయామంటే ఓడిపోయాం. అది సహజం. లైఫ్ అంటే ఇవన్నీ సర్వ సాధారణం. కానీ, ఈ ఏడాది ఆటతీరుకు రాబోయే సీజన్లో మరింత ఎక్కువగా శ్రమించి అభిమానుల్ని అలరిస్తామనే హామీ ఇస్తున్నా. ఇప్పటి వరకూ ఆర్సీబీ చేసిన ప్రదర్శనలను మించిన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని కోహ్లి తెలిపాడు.
2018 ఐపీఎల్ సీజన్కు గాను ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో 6 మాత్రమే గెలిచింది. ఆరంభంలోనే పేలవ ప్రదర్శన చేసి ఆశలు నీరుగార్చింది. ఒకానొక దశలో మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకాన్ని మళ్లీ తుడిచిపెట్టేసింది. ఆఖరి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలై.. ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించలేకపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పరిమితమై లీగ్ దశ నుంచే నిష్క్రమించింది.