బాల్కనీలో కూర్చున్నా
శనివారం ప్రాక్టీస్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ... 'కరోనా మహమ్మారి కారణంగా గత కొంత కాలంగా క్వారంటైన్లో ఎక్కువగా గడుపుతున్నాం. ప్రతి పర్యటనకు ముందు ఇది తప్పనిసరి అయింది. ఒక్కోసారి రెండు సార్లు కూడా ఉండాల్సి వస్తోంది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వచ్చాను. ఇక్కడ ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత జట్టులోని అందరిని కలవడం సంతోషంగా ఉంది.
యూఏఈలో చాలా వేడిగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. క్వారంటైన్లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ సమయం బాల్కనీలో కూర్చున్నా. ఆ సమయంలో ఐపీఎల్ ట్రోఫీ గురించే ఆలోచించేవాడిని. ఢిల్లీకి టైటిల్ అందించాలనుకుంటున్నా' అని తెలిపాడు.
ట్రోఫీ గెలవడమే మా అంతిమ లక్ష్యం
'ఇక్కడి వాతావరణానికి త్వరగా అలవాటు పడాలి. ఎందుకంటే రెండు మూడు రోజుల్లో మాకు మ్యాచ్ ఉంది. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం మా అంతిమ లక్ష్యం. మేము రూపొందించుకున్న ప్రణాళికపై దృష్టిపెట్టబోతున్నాం. మొదటి దశలో చేసిన అద్భుత ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంది. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ సారి మేం ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది' అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. సెప్టెంబరు 22న సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
ఈసారి కప్ కొడతాం
అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'మళ్లీ ఐపీఎల్ ఆడటం బాగుంది. జట్టులోనూ మంచి వాతావరణం నెలకొంది. జట్టులోని ఆటగాళ్లు దుబాయ్లో బాగా కష్టపడుతున్నారు. ఐపీఎల్ రెండో దశ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ మ్యాచ్లు జరగడం సంతోషం. రెండో దశలోనూ విజయంతోనే ఆరంబించాలనుకున్నాం.
అదెంతో ముఖ్యం. సన్రైజర్స్ హైదరాబాద్తో తొలి మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఏప్రిల్లో ఈ సీజన్ మొదలైనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విజయపథంలో నడిచింది. మంచి విజయాలు అందుకున్నాము. అయితే టోర్నీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఆ ఫ్లో మిస్ అయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి విజయ ప్రస్థానం కొనసాగించాలి. ఈ క్రమంలోనే మేము కోల్పోయిన శక్తి సామర్థ్యాలు తిరిగి పొందాలనుకుంటున్నాం. కచ్చితంగా అప్పటి జోరును కొనసాగించి.. ఈసారి కప్ కొడతాం' అని చెప్పాడు.
వరుస విజయాలు
రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పటిష్ట జట్లను సైతం ఓడించి ఔరా అనిపించింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే.