సిడ్నీ: క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించిన ఉదంతం బాల్ ట్యాంపరింగ్. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సునామీనే సృష్టించింది. ఆ జట్టు మూలస్తంభాలుగా భావించే ఇద్దరు క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం విధించడానికి కారణమైంది. వారే- స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్. వారిద్దరి జట్టులో లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది.
వారిద్దర్నీ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నిషేధించిన తరువాత ఆ దేశ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏ స్థాయిలో దిగజారిందో మన చూశాం. శ్రీలంక వంటి జట్టుకు కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది ఆసీస్. మొన్నటి భారత పర్యటన దీనికి మినహాయింపు. భారత జట్టును స్వదేశంలో టీ20, వన్డే సిరీస్ లలో పరాజయం పాలు చేసింది. కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు.. దుబాయ్ లో పర్యటిస్తోంది. పాకిస్తాన్ తో అయిదు వన్డేల సిరీస్ ఆడబోతోంది. దీనికోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ చోటు సంపాదించారు. త్వరలోనే వారు దుబాయ్ వెళ్లే విమానం ఎక్కబోతున్నారు. ఈ నెల 22వ తేదీ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య షార్జాలో తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఆడబోతున్నారు.
ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే: ఉగ్రదాడిపై బంగ్లా వీడియో అనలిస్ట్
నిషేధ కాలం ముగియడంతో వారిద్దరూ జట్టులో పునరాగమనం చేశారు. దీనితో వచ్చే ఐపీఎల్ లోనూ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడు కాగా, స్మిత్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు. బాల్ ట్యాంపిరింగ్ ఉదంతం అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా వారిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించింది. దీనితో వారు ఇంటికే పరిమితమయ్యారు.
జట్టులో పునరాగమం చేయడం చాలా ఆనందాన్నిస్తోందని స్మిత్, వార్నర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే తాము దుబాయ్ లో జట్టుతో కలుస్తామని చెప్పారు. జట్టుకు పూర్వ వైభవం తీసుకుని రావడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. తమ సత్తా చాటుతామని అన్నారు. త్వరలో జరగబోయే ప్రపంచకప్ టోర్నీలో జట్టును గెలిపిస్తామని అంటున్నారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమని, ట్యాంపరింగ్ ఘటనను పీడకలగా మర్చిపోతామని డేవిడ్ వార్నర్ చెప్పాడు. త్వరలో ఐపీఎల్ లో కూడా ఆడతానని స్పష్టం చేశాడు. భారత్ లో ఆడటం తనకు ఇష్టమని అన్నాడు.
పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ లో జరిగే అయిదు వన్డేల షెడ్యూల్ ఇదీ..
మొదటి వన్డే 22వ తేదీన షార్జాలో
రెండో వన్డే 24వ తేదీన షార్జాలో
మూడో వన్డే 27వ తేదీన అబుధాబిలో
నాలుగో వన్డే 29వ తేదీన దుబాయ్ లో
అయిదో వన్డే 31వ తేదీన దుబాయ్ లో