నేను చచ్చిపోవాలా?:
వీడియోలో దానిష్ కనేరియా మాట్లాడుతూ... 'డబ్బు, పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నానని చెప్పేవారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వివాదాన్ని మొదటగా ప్రారంభించింది షోయబ్ అక్తర్. అతను ఓ జాతీయ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సహచరులు నా పట్ల చూపిన వివక్షను వెల్లడించారు. చాలా కాలం నుంచి నా ఉపాధిని కోల్పోయా. మీకింకా ఏం కావాలి? నేను చచ్చిపోవాలా? చెప్పండి' అని భావోద్వేగానికి లోనయ్యాడు.
రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా:
'నేను పదేళ్లు పాకిస్థాన్కు ఆడా అని అంటున్నారు. పదేళ్లు రక్తం ధారపోసి క్రికెట్కు సేవలందించా. క్రికెట్ కోసం నా రక్తాన్ని చిందించా. నా వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా. కానీ.. కొందరు డబ్బు కోసం దేశాన్ని తాకట్టుపెట్టి మరీ ఫిక్సింగ్ చేశారు. అయినా వారిని జట్టులోకి స్వాగతించారు. నేనెప్పుడూ డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు' అని కనేరియా అన్నాడు.
డబ్బు కోసం ఏమైనా మాట్లాడతాడు:
'కనేరియా చెప్పేవన్నీ అబద్ధాలు. డబ్బు కోసం ఏమైనా మాట్లాడతాడు. అతడు విలువలు లేని క్రికెటర్. ఇలా చెయ్యడం ద్వారా వాళ్లేం లబ్ధి పొందుతారో నాకు అర్థం కావట్లేదు. క్రికెట్లో ఫిక్సింగ్కు పాల్పడిన ఒక క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతున్నారో నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను దేశ పరువును తీశాడు. ఒకవేళ నిజంగా అతడు మత వివక్షకు గురైతే అన్నేళ్లు కొనసాగేవాడా? 'అని మియాందాద్ ప్రశ్నించాడు.
అక్తర్ సంచలన వ్యాఖ్యలు:
పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు కనేరియాపై వివక్ష చూపెట్టేవారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం చూశానన్నాడు. జట్టులోని మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ఇందుకు అక్తర్కు కనేరియా థాంక్స్ చెప్పడంతో పాటు పేర్లను త్వరలోనే వెల్లడిస్తానంటూ పేర్కొన్నాడు. దాంతో కనేరియాపై మియాందాద్ మండిపడ్డాడు.