దక్షిణాఫ్రికాకు కాంట్రెల్ షాక్:
మొదటగా టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాను విండీస్ బౌలర్ కాంట్రెల్ షాక్ ఇచ్చాడు. కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ ఆమ్లా (6) స్లిప్లో గేల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం కాట్రెల్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి మర్కరమ్ (5) కీపర్ షాయ్ హోప్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సఫారీలు 28 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
వర్షంతో మ్యాచ్ రద్దు:
ఈ సమయంలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. వర్షంతో ఆట నిలిచే సమయానికి దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ఇక వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు పాల్ విల్సన్, రొడ్ టక్కర్లు రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింటు లభించింది. ఈ పాయింటుతో దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతా తెరిచింది. ఇంతకుముందు పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ కూడా వర్షంతో రద్దయింది.
వాతావరణం మన చేతుల్లో ఉండదు:
'వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం చిరాకుగా ఉంటుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. కానీ వాతావరణం మన చేతుల్లో ఉండదు. మ్యాచ్ను వికెట్లు కోల్పోకుండా ప్రారంభించాలి అనుకున్నాం. ప్రత్యర్థి జట్టులో మెరుగైన బౌలర్లు ఉండడంతో తొందరగా వికెట్లు కోల్పోయాం. వర్షం పడే సందర్భాల్లో రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం సులువు. 30-35 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యపడలేదు. నిరాశ చెందాం. లుంగీ వచ్చే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. ఇక మెరుగైన ప్రదర్శన చేయాలి' అని డుప్లెసిస్ తెలిపాడు.