గత రికార్డులను ఆలోచించొద్దు:
కీలక మ్యాచ్ నేపథ్యంలో గురువారం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆ దేశ జట్టుకు కొన్ని సలహాలిచ్చాడు. 'భారత్తో పాకిస్థాన్ ఎప్పుడు ఆడినా పెద్ద మ్యాచే. ఇరు దేశ అభిమానులు ఆసక్తిగా ఉంటారు. ప్రపంచకప్ టోర్నీల్లో గత రికార్డుల గురించి ఆలోచించకుండా.. కేవలం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించిన విషయాన్ని మాత్రమే పాక్ గుర్తుంచుకోవాలి. ఫైనల్ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి' అని వకార్ యూనిస్ సూచించాడు.
అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే:
'భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ను ఆదిలోనే వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టాలి. తొలి పది ఓవర్లలో వికెట్లు తీయడం కీలకం. విజయం సాధించాలంటే భారత్తో మ్యాచ్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే. ఆస్ట్రేలియాతో ఓడినప్పటికీ ఆ మ్యాచ్లో పాక్ ప్రదర్శన బాగానే ఉంది. పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్తో మ్యాచ్లో కూడా అతను వికెట్లు తీయాలి' అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు.
భారత్కే విజయావకాశాలు ఎక్కువ:
రెండు జట్ల మధ్య బలాబలాలు చూస్తే ఈసారీ భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత జట్టులో బ్యాటింగ్, బౌలింగ్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా మంచి ఫామ్లో ఉంది. మరోవైపు పాక్ బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. బౌలర్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ఏ రోజు ఎలా ఆడుతుందో తెలీదు. ఆదివారం వాళ్లు చెలరేగితే భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రపంచకప్ టోర్నీల్లో పాక్పై ఎదురు లేని ఆధిపత్యం భారత్కు ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను 180 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన రికార్డు పాక్కు ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.