సుదీర్ఘకాలంగా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఫిజియో పాట్రిక్ ఫర్హాట్, ఫిట్నెస్ కోచ్ శంకర్ బసులు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఒప్పందం ప్రకారం 2019 ప్రపంచకప్ వరకు మాత్రమే పాట్రిక్, శంకర్ బసులు కొనసాగాలి. ఈ క్రమంలో ప్రస్తుత ప్రపంచకప్తోనే వీరి పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఫిజియోగా తాను తప్పుకొంటున్నట్లు పాట్రిక్ గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించగా.. శంకర్ బసు తన రాజీనామాను బీసీసీఐ అధికారులకు అందజేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
'జట్టుతో నా చివరి రోజు నేను కోరుకున్నట్లుగా ముగియలేదు. గత నాలుగేళ్లుగా భారత జట్టుతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. క్రీడాకారులు మరియు సహాయక సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి' అని పాట్రిక్ ఫర్హాట్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
Whilst my last day with the team did not turn out as I wanted it to, I would like to thank @BCCI for the opportunity to work with the team for the last 4 years. My best wishes to all of the players and support staff for the future #TeamIndia
— Patrick Farhart (@patrickfarhart) 10 July 2019
2015లో భారత జట్టు ఫిజియోగా పాట్రిక్ ఫర్హాట్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి జట్టుతోనే ఉంటూ ఎన్నో సేవలు చేశారు. ఇక 2015లో శ్రీలంక పర్యటనకు భారత జట్టుతో చేరిన బసు ఆటగాళ్లను ఫిట్గా ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అథ్లెట్గా తీర్చిదిద్దడంలో ఇతని పాత్ర అమోఘం. వ్యక్తిగత కారణాల రీత్యా 2016లో తన బాధ్యతల నుంచి విరామం తీసుకున్న బసు.. 2017లో మళ్లీ జట్టుతో కలిసాడు.
గతంలో ఐపీఎల్లో బెంగళూరుకు కూడా బసునే ఫిట్నెస్ ట్రెయినర్గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీకి వ్యక్తిగత ట్రైనర్గానూ శంకర్ బసు పని చేశాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండోసారి సెమీఫైనల్ గండాన్ని దాటలేకపోయిన భారత్.. ప్రపంచకప్-2019లో తన ప్రస్థానంను ముగించింది.