భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా సెమీఫైనల్కు చేరుకోవడానికి ఓపెనర్ రోహిత్ శర్మ కృషి ఎంత ఉందో బుమ్రాది కూడా అంతే ఉంది అని సచిన్ పేర్కొన్నాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్లో ఉండటం, మరోవైపు జస్ప్రీత్ బుమ్రా 17 వికెట్లతో రాణించడంతో టీమిండియా సునాయాసంగా సెమీఫైనల్కు చేరుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశంలో సచిన్ మాట్లాడుతూ... ' టీమిండియా సెమీఫైనల్కు చేరుకోవడానికి రోహిత్ శర్మ కృషికి సమానంగా బుమ్రా కూడా కష్టపడ్డాడు. వికెట్లు తీయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టు విజయాల్లో మాత్రం తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ అద్భుతం. కీలక సమయాల్లో బంతిని అందుకుని ఫలితం రాబడుతున్నాడు' అని సచిన్ అన్నారు.
బుమ్రా రాణించని పక్షంలో టీమిండియా మరో ప్లాన్తో ఉందా అన్న ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ.. అలా అనుకోవడం లేదు. బుమ్రా వికెట్లు తీయకపోయినా.. విజయానికి అవసరమైన తీరులో బౌలింగ్ చేస్తాడు. ఈ టోర్నీలో బాగా బౌలింగ్ చేసినా.. వికెట్లు ఎక్కువగా తీయలేదు. శ్రీలంకతో మ్యాచ్లో కీలకమైన మూడు వికెట్లు తీశాడు' అని సచిన్ తెలిపారు.
శనివారం శ్రీలంకతో జరిగిన చివరి లీగ్మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బుమ్రా కీలక కరుణరత్నే, కుశాల్ పెరీరా, మాథ్యూస్ వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బుమ్రా 8 మ్యాచ్లు ఆడి 17 వికెట్లతో బౌలర్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధికంగా ఈ టోర్నీలో 8 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (26), బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ గెలవడం, దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం సాధించింది. దీంతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ (11 పాయింట్లు)తో మంగళవారం మాంచెస్టర్లో మొదటి సెమీఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది.