హైదరాబాద్: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ ఛాంపియన్షిప్లో కొన్ని మ్యాచ్ల్లో ఆడితే బాగుంటుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ వేదికగా కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనున్న సంగతి తెలిసిందే.
1986 నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్ను గెలుచుకుంది. ప్రస్తుతం 66 టెస్టుల్లో విరాట్ కోహ్లీ సగటు 53.40గా ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టెస్టు సిరిస్లో 5 టెస్టుల్లో కోహ్లీ సగటు 13.40గా నమోదైంది.
దీంతో మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగి కీర్తింపబడుతోన్న విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలనుకుంటే ప్రతిచోట పరుగులు సాధించాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ "నిరంతర సాధన వ్యక్తిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతుంది. ప్రతిఒక్కరు అలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయాలి" అని అన్నాడు.
"అలెన్ బోర్డర్, వివ్ రిచర్డస్, సునీల్ గవాస్కర్ల గురించి ఎలాగైతే చెబుతామో అలా. వీరంతా ప్రపంచంలో ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితులైనా రాణించారు. విరాట్ కోహ్లీ కూడా ప్రపంచంలో అత్యంత కష్టతరమైన పరిస్థితులుగా భావిస్తామో, అక్కడ అతడు పరుగులు సాధించాలి" అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
"అక్కడికి వెళ్లి ఆడటాన్ని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ఎల్లప్పుడూ అతనికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఒకటి గాని, రెండు సీజన్లు అతడు ఆడటం తప్పేంకాదని.. అక్కడ మెరుగ్గా రాణించేందుకు సాయపడుతుంది" అని అన్నాడు. చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్లో పర్యటించిన టీమిండియా 1-3తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.