దుబాయ్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-29) కారణంగా ఈ నెల చివరలో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్లో నిర్వహించాలని ఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో ఐసీసీ పేర్కొంది. మార్చి 26 నుంచి 29 వరకు జరగాల్సిన బోర్డు సమావేశాన్ని మే తొలి వారానికి వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొంది. అత్యవసర విషయాలను మాత్రమే మే జరిగే సమావేశంలో చర్చిస్తామని ఐసీసీ తెలిపింది.
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ 2020 వాయిదా.. షెడ్యూల్లో మార్పు!!
'ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్-19ను దృష్టిలో పెట్టుకొని, సభ్యత్వ దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నెల చివరలో జరగాల్సిన బోర్డు సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్లో నిర్వహిస్తున్నాం. క్రికెట్ బోర్డుల అధికారులు కాన్ఫరెన్స్ కాల్లోనే పాల్గొంటారు. వారి ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యం. అత్యవసర విషయాలను మాత్రమే మే తొలి వారంలో నిర్వహించే సమావేశంలో చర్చిస్తాం' అని ఐసీసీ పేర్కొంది. కరోనా ప్రభావంతో మార్చి 3న జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు రద్దవుతున్నాయి. మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కూడా వాయిదా పడింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 15కి వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కోవిడ్-19 నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ను నిర్వహించలేమంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, లా లీగా, సేరీ ఏ, ఎన్బీఐ, ఏటీపీ టూర్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ను రద్దు చేశారు. కరోనా కారణంగా చైనాలో 3,169 మంది చనిపోగా.. ప్రపంచవ్యాప్తంగా 4,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని హుబీ ప్రావిన్స్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక్కడ మూడింటిలో రెండు వంతుల కేసులు నమోదయ్యాయి. అయితే చైనాలో నమోదు కేసుల సంఖ్య ఇటీవల తగ్గింది.