షేక్హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు:
ఏదైనా మ్యాచ్లో టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కరోనా గుర్తుకురావడంతో వెంటనే ఫించ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఇరు జట్ల కెప్టెన్ల ముఖాలలో నవ్వు వెల్లివిరిసింది. తర్వాత విలియమ్సన్, ఫించ్లు తమ మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు.
మోచేతితో అంటే కష్టమే:
ఈ సరదా సంఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన ట్విటర్లో షేర్ చేసింది. 'క్రికెట్లో హ్యాండ్ షేక్ బాగా అలవాటైపోయింది. ఇప్పుడు మోచేతితో అంటే కష్టమే అంటూ ఇరు కెప్టెన్లు అనుకుంటున్నట్లుగా' కాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా షేక్హ్యాండ్ ఇచ్చుకోవడానికి భయపడుతున్నారంటే అంతా కరోనా వైరస్ పుణ్యమే.ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా 'నమస్తే'తోనే సరిపెట్టుకుంటున్నారు.
రిచర్డ్సన్కు కరోనా:
ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్కు కరోనా సోకిందని అనుమానం రావడంతో మ్యాచ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం రిచర్డ్సన్కు కోవిడ్కు సంబంధించిన టెస్టులు పూర్తి చేశామని, వాటి రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కరోనా ప్రభావంతో ఈ సిరీస్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరగడం విశేషం.
వార్నర్, ఫించ్ అర్ధ సెంచరీలు:
ఆసీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. శుక్రవారం మొదటి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వార్నర్ (67), ఫించ్ (60) అర్ధ సెంచరీలు చేసారు. లబుషేన్ (56) ఫామ్ కొనసాగిస్తున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.