చెన్నై మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్తో కలిసి రాహుల్ మాట్లాడుకుంటూ క్రీజులో అడుగుపెట్టాక.. బ్రావో అటుగా వెళ్తూ కనిపించాడు. దీంతో బ్రావోను పిలిచిన గేల్.. తన షూ లేస్ను బిగించి కట్టమన్నాడు.
గేల్ షూ లేస్ బిగించిన బ్రావో
వెంటనే బ్రావో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ.. గేల్ షూ లేస్ బిగించి కట్టాడు. గత రెండు సీజన్లలో పేలవ ఆటతీరు కనబర్చిన గేల్ను వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపని సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మరి కాసేపట్లో ముగుస్తుందనగా పంజాబ్ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ పంజాబ్ యాజమాన్యాన్ని ఒప్పించి రెండు కోట్ల ప్రాథమిక ధరకే గేల్ను కొనుగోలు చేశాడు.
తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గేల్
తనను వేలంలో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదన్న కసో లేదా సత్తా చాటాలన్న తపనో గానీ... మూడో మ్యాచ్లో తనకిచ్చిన అవకాశాన్ని ఈ గేల్ సద్వినియోగం చేసుకున్నాడు. చెన్నైపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి పంజాబ్కు చక్కటి శుభారంభాన్నించ్చాడు. గేల్ దూకుడుతో పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ 75 పరుగులు రాబట్టింది. 22 బంతుల్లోనే హాఫ్ పూర్తి చేసుకున్న గేల్ 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
గేల్ ఔటయ్యాకు తగ్గిన పంజాబ్ పరుగుల వేగం
అయితే, గేల్ ఔటయ్యాక కింగ్స్ ఎలెవన్ పరుగుల వేగం తగ్గింది. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్ వేసింది. ఆదివారం చెన్నైపై 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్మన్లలో ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు ) ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. రాయుడు (49) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.