సౌరాష్ట్ర: పింక్ బంతితో ఆడటం బ్యాట్స్మన్కు పెద్ద సవాలని, అది సాంప్రదాయక ఎర్ర బంతితో పోలిస్తే చాలా కష్టతరమని టీమిండియా నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ఆడేందుకు భారత ఫాస్ట్ బౌలర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నాడు. ఆస్ట్రేలియాలో డిసెంబర్ 3 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. ఆడిలైడ్ వేదికగా ఓవల్ మైదానంలో రెండో టెస్టును డే/నైట్ మ్యాచ్గా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.
తాజాగా ఛెతేశ్వర్ పుజారా సోనీ టెన్పిట్ స్టాప్తో మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మకు ఇప్పటికే పింక్ బాల్ టెస్టు ఆడిన అనుభవం ఉంది. ఈ ముగ్గురూ ఆస్ట్రేలియాతో ఓవల్ టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఈడెన్గార్డెన్స్ వేదికగా బంగ్లాతో తలపడిన తొలి పింక్ బాల్ మ్యాచ్ను వాళ్లెంతో ఆస్వాదించి ఉండొచ్చు. ఆస్ట్రేలియా పిచ్లపై గులాబీ బంతితో బౌలింగ్ చేయడం వారికి గొప్ప అనుభూతిని మిగులుస్తుందని నేను అనుకుంటున్నా' అని అన్నాడు.
'పింక్ బంతితో ఆడటం బ్యాట్స్మన్కు పెద్ద సవాలు. అది సాంప్రదాయక ఎర్ర బంతితో పోలిస్తే చాలా కష్టతరం. ఆట ఆడే ఫార్మాట్ అదే అయినా పింక్ బంతి దృశ్యత, పేస్ వేరుగా ఉంటాయి. ఒక బ్యాట్స్మన్గా ఆ బంతికి అలవాటుపడాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎర్ర బంతికి అలవాటుపడ్డ యువ క్రికెటర్లకు పింక్ బంతితో ఆడటం సవాలుగా మారుతుంది. గులాబీ బంతితో ఆడటం అంత తేలిక కాదు. దానికి ప్రత్యేకంగా నెట్ సెషన్స్ నిర్వహించాలి. దేశవాళీ క్రికెట్లో అలా చేయడం కష్టం. ఏ యువ ఆటగాడికైనా రంజీల్లో ఎర్ర బంతితోనే ఆడిన అనుభవం ఉంటుంది. తద్వారా వారు జాతీయ జట్టులోకి వచ్చాక దానితో ఆడటం సులభమవుతుంది' అని పుజారా చెప్పాడు
ఛెతేశ్వర్ పుజారా గత ఆసీస్ పర్యటనలో బ్యాటింగ్తో అదరగొట్టగా.. భారత్ చారిత్రక టెస్టు సిరీస్ 2-1 గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే రాబోయే టెస్టు సిరీస్లో ఇరు జట్ల మధ్య తొలి డే/నైట్ మ్యాచ్ నిర్వహిస్తుండడంతో మరింత ఆసక్తి పెరిగింది. పుజారా భారత్ తరఫున 77 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. లాక్డౌన్ సందర్భంగా పుజారా ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. మరోవైపు ఖాళీ సమయమంతా కుటుంబంతో గడుపుతున్నాడు.ఇటీవల బ్యాడ్మింటన్ కోచ్ అవతారమెత్తాడు. తన భార్య పూజ కోసం పుజారా కోచ్గా మారాడు.
సుశాంత్కు ఓ మాటిచ్చా.. కానీ ఇప్పుడు అతడు లేడు: క్రికెటర్