హైదరాబాద్: ఈ ఏడాది ఆరంభంలో జొహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత ఆటగాడు పుజారా 54 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇదే క్రమంలో.. పూజారా తాజాగా ఇలాంటి ఇన్నింగ్సే మరొకటి ఆడాడు. ఐపీఎల్లో పుజారాను ఎవరూ సొంతం చేసుకోకపోవడంతో ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
జూన్ 14న అఫ్గానిస్థాన్తో టెస్టు కోసం తిరిగి భారత్ వచ్చిన పుజారా ఆ తర్వాత తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి యథావిధిగా కౌంటీల్లో ఆడుతున్నాడు. ఐతే, కౌంటీల్లో పుజారా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ టోర్నీలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. రాయల్ లండన్ వన్డే కప్లో మాత్రం పుజారా మూడు హాఫ్ సెంచరీలను జోడించి 370 పరుగులు చేశాడు. ముఖ్యంగా డేల్ స్టెయిన్ బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో పుజారా బాగా ఇబ్బంది పడుతున్నాడు.
యార్క్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న పుజారా కౌంటీ ఛాంపియన్షిప్లో 10 ఇన్నింగ్స్ల్లో కలిపి చేసిన పరుగులు 132. తాజాగా కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా సర్రే-యార్క్షైర్ మధ్య నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో పుజారా 41 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. 19వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించి పుజారా తన పరుగుల ఖాతాను తెరిచాడు.
కౌంటీ ఛాంపియన్షిప్లో ఒక ఇన్నింగ్స్లో పరుగుల ఖాతా తెరిచేందుకు అతడు తీసుకున్న సమయం సుమారు 70 నుంచి 73 నిమిషాలు. ఈ ఛాంపియన్షిప్లో 1969లో సిమన్స్ తన పరుగుల ఖాతా తెరిచేందుకు గరిష్ఠంగా 74 నిమిషాలు తీసుకున్నాడు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ప్రస్తుతం ఈ జాబితాలో పుజారా ఐదో స్థానంలో నిలిచాడు. పుజారా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నాడు. ఐర్లాండ్తో సిరీస్ అనంతరం.. ఆగస్టు 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.