
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. ఓ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ని 'మన్కడింగ్' చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే.. బట్లర్ క్రీజు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఇది గమనించిన అశ్విన్ బౌలింగ్ని నిలిపివేసి.. బెయిల్స్ని పడగొట్టాడు. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. దాంతో అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. అప్పటినుంచి మన్కడింగ్ వివాదంపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంది.
ఐపీఎల్ 2021లో మన్కడింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముస్తాఫిజుర్ రెహ్మన్ బౌలింగ్ వేయడానికి ముందే డ్వేన్ బ్రావో క్రీజు దాటి ముందుకు వెళ్లిపోయాడు. వాస్తవానికి ఒక బౌలర్ బంతి విసిరే వరకు నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మన్ క్రీజు విడిచే అవకాశం లేదు. అప్పటికే బ్రావో క్రీజును దాటేయడం.. ముస్తాఫిజుర్ బంతిని విసరడం జరిగింది. అయితే ముస్తాఫిజుర్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో.. రూల్ ప్రకారం అవతలి జట్టుకు ఫ్రీ హిట్ ఆడే అవకాశం వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తన ట్విటర్లో ఓ ఫొటో (బ్రావో, ముస్తాఫిజుర్) షేర్ చేస్తూ మన్కడింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఓ బౌలర్ గీత దాటి బంతిని వేస్తే.. నోబాల్గా పరిగణించి అతనికి పెనాల్టీ విధిస్తారు. మరి అదే సమయంలో బౌలర్ బంతిని విడవకుండానే బ్యాట్స్మన్ క్రీజు దాటి వెళితే దానికి ఎలాంటి చర్యలు ఉండవా?. అక్కడ బౌలర్కు మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా.. క్రీడాస్పూర్తికి విరుద్ధమని కామెంట్స్ చేస్తారు. అయితే మరి ఇలాంటి చర్యలకు పరిష్కారం చూపండి' అంటూ ఐసీసీని ప్రశ్నించాడు. వెంకటేష్ ప్రసాద్ చేసిన ట్వీట్ సోషల్ మీడియలో వైరల్గా మారింది. మరి ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ను కట్టడి చేయడానికి మన్కడింగ్ విధానాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని స్టార్ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నాడు. మన్కడింగ్ విధానం క్రికెట్ స్ఫూర్తితో ముడిపడి ఉండటాన్ని నాన్సెన్స్గా అభివర్ణించాడు. మన్కడింగ్ విధానంలో అవుట్ చేయడానికి నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్మెన్లు తమకు తాముగా అవకాశాన్ని కల్పిస్తున్నారన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని చూసీ చూడనట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. నైతికతకు కట్టుబడి ఉండటం వల్లే ముస్తాఫిజుర్కు.. మన్కడింగ్ చేయాలనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని భోగ్లే పేర్కొన్నాడు.