
హైదరాబాద్: జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో భారత ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన కొద్ది మంది ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే ఒకరు. క్రికెటర్గా అనేక రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. భారత క్రికెట్లోనే అత్యంత శాంత స్వభావుడిగా పేరున్న అనిల్ కుంబ్లే ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్గా, టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
అభిమానులు ముద్దుగా కుంబ్లేను జింబో అని పిలుస్తారు. భారత క్రికెట్కు ఎనలేని సేవలందించిన కుంబ్లే గురువారం 49వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. అనిల్ కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు, సెలెబ్రిటీలు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరికొత్తగా కుంబ్లేకి సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపాడు.
సెహ్వాగ్ తన ట్విట్టర్లో "భారత దిగ్గజ క్రికెటర్లలో నువ్వు కూడా ఒకడివి. భారత్కు అనేక చిరస్మరణీయమైన విజయాలు అందించి మా అందరికీ ఒక అద్భుతమైన రోల్ మోడల్గా నిలిచావు. కానీ నీ కెరీర్లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని దూరం చేసినందుకు సారీ. నిజ జీవితంలో నువ్వు సెంచరీ కొట్టాలని ప్రార్థిస్తున్నా. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచుకో. కమాన్.. కమాన్ అనిల్ భాయ్.. హ్యాపీ బర్త్ డే" అంటూ ట్వీట్ చేశాడు.
ఇక, హర్భజన్ సింగ్ తన ట్విట్టర్లో "నువ్వు భారత్కు అతి పెద్ద మ్యాచ్ విన్నర్. నువ్వు ఒక గ్రేటెస్ట్ స్పిన్నర్. నా బౌలింగ్ పార్టనర్, నా గురువు కుంబ్లేకు ఇవే నా విషెస్" అని ట్వీట్ చేశాడు. భజ్జీ ట్వీట్కు కుంబ్లే "థాంక్యూ భజ్జీ.. ఇప్పుడు నీ నుంచి కొన్ని పంజాబీ పాఠాలు నేర్చుకోవాలి" అని సమాధానమిచ్చాడు.
ఇదిలా ఉంటే, ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేని ఆ జట్టు యాజమాన్యం నియమించిన సంగతి తెలిసిందే. కాగా, భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 619 వికెట్లతో భారత్ తరఫున టాప్లో కొనసాగుతున్నాడు.
అనిల్ కుంబ్లే అక్టోబర్ 17, 1970లో బెంగళూరులో జన్మించిన అనిల్ కుంబ్లే తన మొదటి వన్డేని 1990లో శ్రీలంకపై ఆడాడు. భారత్ తరుపున మొత్తం 132 మ్యాచ్లాడిన కుంబ్లే 29.6 సగటుతో 619 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 271 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించిన కుంబ్లే 30.9 సగటుతో 337 వికెట్లు పడగొట్టాడు. 2007లో ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో కుంబ్లే సెంచరీ సాధించాడు.