హైదరాబాద్: విజయోత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్న ఇంగ్లాండ్ జట్టుకు మరో శుభవార్త. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు ఊరట కలిగించే వార్త అయిన విషయమిది. టీమిండియాతో జరగబోయే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటున్నాడు. గతేడాది సెప్టెంబర్లో నైట్క్లబ్ వెలుపల తప్పతాగి ఒక వ్యక్తిని చితక బాదిన కేసును బ్రిస్టల్ క్రౌన్ కోర్టు విచారణ జరిపి తుది తీర్పునిచ్చింది. 12 మందితో కూడిన ధర్మాసనం స్టోక్స్ ఆత్మరక్షణ కోసమే దాడి చేశాడన్న వాదనను నమ్ముతూ నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ ఆల్రౌండర్కు జట్టులో చోటు కల్పించింది.
బెన్ స్టోక్స్ తిరిగి రావడటంతో ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. తొలి టెస్టులో ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో ఈ ఆల్రౌండర్ కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్టుకు స్టోక్స్ గైర్హాజర్తో తుది జట్టులో చోటు దక్కించుకున్న క్రిస్ వోక్స్ అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. టెస్టుల్లో తొలి వ్యక్తిగత సెంచరీ నమోదు చేయడమే కాకుండా, నాలుగు వికెట్లు తీసి టీమిండియా ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
మరోవైపు కోర్టు తీర్పు రాగానే భారత్తో ఈ నెల 18 నుంచి జరిగే మూడో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో 13వ ఆటగాడిగా స్టోక్స్ను కూడా సెలక్టర్లు చేర్చారు. అయితే అతనికి ఇప్పుడు తుది జట్టులో చోటు అంత సులువు కాదు. స్టోక్స్ స్థానంలో వచ్చిన క్రిస్ వోక్స్ లార్డ్స్ టెస్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా, మరే ఆటగాడిని తప్పించే పరిస్థితి కనిపించడం లేదు.
టీమిండియాతో ఆగస్టు 18 నుంచి నాటింగ్హామ్లో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలో ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ తికమకపడుతోంది. ఇక నాటింగ్హామ్ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బ్రిటీష్ జట్టు ఉవ్విళ్లూరుతుండగా.. కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి సిరీస్ అంతర్యం తగ్గించాలని టీమిండియా ఆరాటపడుతోంది.