హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు వచ్చే ఐదేళ్లలో ఆడబోయే మ్యాచ్ల ప్రసార, ఇతర మీడియా హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. స్వదేశంలో టీమిండియా తలపడే మ్యాచ్ల మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల వేలం బిలియన్ డాలర్ల (రూ. 6,500 కోట్లు)కు చేరే పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం నిర్వహిస్తున్న ఈ-వేలంలో స్టార్, సోనీ, జియో సంస్థలు గట్టిగానే తలపడుతున్నాయి.
వచ్చే ఐదేళ్లలో టీమ్ఇండియా 102 మ్యాచ్లు ఆడబోతుండగా.. వీటి మీడియా హక్కుల రేటు రూ.6 వేల కోట్ల మార్కును దాటింది. మంగళవారం ఆరంభమైన ఈ వేలంలో తొలి రోజు అత్యధికంగా రూ.4442 కోట్లకు బిడ్ దాఖలైంది. రెండో రోజు కూడా పై మూడు సంస్థల మధ్య పోటీ కొనసాగింది. రూ.4,565.2 కోట్లు.. రూ.5,488.3 కోట్లు.. రూ.5,748 కోట్లు.. రూ.6001 కోట్లు.. ఇలా బిడ్ ధర పెరుగుతూ వెళ్లింది. చివరికి గరిష్ట బిడ్ రూ.6032.5 కోట్లుగా తేలింది. ఆ బిడ్ ఎవరిదని వెల్లడి కాలేదు.
2012 నుంచి ఐదేళ్ల కాలానికి టీమ్ఇండియా మ్యాచ్ల మీడియా హక్కుల్ని స్టార్ సంస్థ రూ.3,851 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పుడు మ్యాచ్కు సగటున రూ.43 కోట్ల ధర పలికింది. బుధవారం చివరికి పలికిన అత్యధిక బిడ్ ప్రకారం ఒక మ్యాచ్కు మీడియా హక్కుల సగటు ధర రూ.59.16 కోట్లకు చేరింది. వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్ మీడియా హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ సంస్థ ఒక్కో మ్యాచ్కు సగటున రూ.55 కోట్ల దాకా చెల్లిస్తోంది.
ఆ ధరను టీమ్ఇండియా మ్యాచ్ల రేటు ఇప్పటికే దాటేసింది. ఈ-వేలం గురువారం కూడా కొనసాగనుంది. మధ్యాహ్నానికి ప్రక్రియ ముగుస్తుందని, హక్కులెవరితో తేలిపోతాయని బీసీసీఐ వర్గాలంటున్నాయి. గరిష్ట బిడ్ రూ.7 వేల కోట్ల దాకా వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.