
హైదరాబాద్: మీడియా ప్రసార హక్కులను సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో బీసీసీఐ ఐదేళ్ల షెడ్యూల్ను ముందే విడుదల చేసేసింది. 2019-2023వరకు షెడ్యూల్ను ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించిన ప్రసార హక్కుల నిమిత్తం వేలంలో పాల్గొనమంటూ మీడియా ఛానెళ్లకు సమాచారాన్ని చేరవేసింది.
ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకోలేకపోయిన ఛానెళ్లకు వేర్వేరు కారణాలు లేకపోలేదు. ప్రధాన మీడియా నెట్ వర్క్ అయిన సోనీ నెట్వర్క్ అప్పటికే పలు ముఖ్యమైన డీల్స్ కుదుర్చుకుని ఉండటంతో ఈ డీల్ను కోల్పోయింది. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేల క్రికెట్ బోర్డులతో కుదుర్చుకుని ఉండటమే ఇందుకు కారణం.
ఈ సమయంలో స్వదేశపు ఛానెళ్లు హక్కులు సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాయి. ఇండియన్ క్రికెట్ జట్టులో దీనికి సంబంధించి కొన్ని సందేహాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న జట్టు ఒకవేళ విదేశీ పర్యటనలో ఉంటే అక్కడ ప్రసారాలను ఎలా కొనసాగిస్తారనే సందేహాలు నెలకొన్నాయి.
దీనికి వివరణ ఇచ్చిన బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ మాట్లాడుతూ.. 2019 సంవత్సరం నుంచి 2023వరకు ఐదేళ్ల పాటు ప్రసార హక్కులను సొంతం చేసుకునేందుకు పారదర్శకమైన వేలంలో పాల్గొనాలని మీడియా ఛానెళ్లను సూచించారు. ఈ ఒప్పందానికి మొత్తం మూడు దశలుగా కేటాయిస్తారు. స్వదేశ ప్రసార హక్కులు, ఖండాంతర ప్రసార హక్కులు, పూర్తి ప్రసార హక్కులు.