మూడు రోజల పాటు జరిగిన ఈ-వేలం
తాజాగా బీసీసీఐ మీడియా హక్కుల కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఈ-వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, స్టార్ ఇండియా, రిలయన్స్ పోటీ పడ్డాయి. ఈ వేలంలో గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్ కేటగిరీలో స్టార్ ఇండియా ఈ అత్యధిక బిడ్ దాఖలు చేసి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా టీవీ, డిజిటల్ హక్కులు స్టార్ ఇండియాకే
దీంతో భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీవీ, డిజిటల్ హక్కులను స్టార్ ఇండియా దక్కించుకున్నట్లు అయింది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ హక్కులను స్టార్ ఇండియా రూ.16347 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా బిడ్డింగ్ ప్రకారం ఏప్రిల్ 15, 2018 నుంచి మార్చి 31, 2023 వరకు స్టార్ ఇండియా టీమిండియా ఆడే మ్యాచ్లను ప్రసారం చేయనుంది.
ఒక్కో మ్యాచ్కు బ్రాడ్కాస్టింగ్ హక్కుల విలువ 60 కోట్లు
తాజా బిడ్ ప్రకారం ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల విలువ రూ.60 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు స్టార్ ఇండియా రూ.54.5 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ అన్ని ఫార్మాట్లు కలుపుకొని 102 మ్యాచ్లు ఆడనుంది. ఈ 102 మ్యాచ్లను స్టార్ ఇండియా ప్రసారం చేయనుంది.
ఐదేళ్ల కాలానికి మొత్తం 102 మ్యాచ్లను ప్రసారం చేయనున్న స్టార్
ఈ మీడియా హక్కుల కింద పురుషుల దేశవాళీ మ్యాచ్లతో పాటు మహిళల అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ప్రసారం చేయనుంది. మొత్తం 102 పురుషుల అంతర్జాతీయ మ్యాచుల్లో 2018-19 సీజన్లో 18 మ్యాచ్లు, 2019-20లో 26 మ్యాచ్లు, 2020-21లో 14 మ్యాచ్లు, 2021-22లో 23 మ్యాచ్లు, 2022-23 మధ్య 21 మ్యాచ్లు ఉంటాయి.