కాంట్రాక్ట్ కన్నా ముందే:
మరోసారి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాలంటూ అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోరనునట్లు సమాచారం తెలుస్తోంది. కోచ్ రేసులో జంబోనే ముందున్నాడట. ఇంతకముందు కుంబ్లే టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2016-17 మధ్య భారత జట్టు ప్రధాన కోచ్గా జంబో ఏడాది కాలం పనిచేశాడు. ఆ సమయంలో సచిన్ టెండ్యూలర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. కుంబ్లేను నియమించింది. అయితే అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లీకి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
ఆసక్తి చూపిస్తాడా?:
ఇప్పటికైతే అనిల్ కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు కోహ్లీ జట్టులోనే ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లీ.. వన్డే, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ పెద్దలు జంబోను కలిసి అన్ని విషయాలు మాట్లాడుతారని వార్తలు వస్తున్నాయి. 'విరాట్ కోహ్లీ ఒత్తిడి వల్లే అప్పటి క్రికెట్ సలహా కమిటీ కుంబ్లేను తొలగించింది. కానీ అది సరైన ఉదాహరణ కాదు. అయితే ఇప్పుడు ప్రధాన కోచ్కు దరఖాస్తు చేసుకునేందుకు కుంబ్లే సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు' అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.
జంబో తర్వాత లక్ష్మణ్:
అనిల్ కుంబ్లేతో పాటు హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హైదరాబాద్ టీమ్ సన్రైజర్స్కు మెంటార్గా ఉన్నాడు. మరోవైపు జంబో కూడా కింగ్స్ పంజాబ్ జట్టుకు కోచ్గా ఉన్నాడు. వీరూ కూడా గతంలో ఐపీఎల్ జట్టుకు మెంటార్గా పనిచేశాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా కోచ్ రేస్లో ఉన్నాడట. అయితే వీరందరిలో కుంబ్లేకే బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. జంబో తర్వాతి రేసులో లక్ష్మణ్ ఉన్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే టీ20 ప్రపంచకప్ 2021 ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే.
రవిశాస్త్రి సక్సెస్:
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. 2016 తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్ కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. తాజాగా ఇంగ్లీష్ గడ్డపై కూడా అద్బుతాలు చేసింది. అయితే రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. దాంతో బీసీసీఐ కొత్త కోచ్ను వెతికేపనిలో పడింది.