హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డులుగా పేరొందిన బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సంయుక్తంగా కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల్లో ఉన్న మేధోశక్తిని వినియోగించుకుని క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఓ నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాయి.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ నిపుణులచే కోచ్లకు శిక్షణ పాఠాలు ఏర్పాటు చేశారు. ఈ కోర్సులో భాగంగా బీసీసీఐ గుర్తింపు పొందిన కోచ్లకు క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి ఎన్సీఏ ఓ సరికొత్త కోర్సులో శిక్షణ ఇవ్వనుంది.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎన్సీఏలో నిర్వహించే కోర్సులో లెవల్-2 కోచింగ్ తొలి దశలో 25 మంది మహిళా కోచ్లు, మలి దశలో 25 మంది పురుష కోచ్లు శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కోర్సులో క్రికెట్కు సంబంధించిన సరికొత్త విధానాలను బోధించనున్నారు.
కాగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ సిబ్బందితో శిక్షణ ఇవ్వడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సంతోషంగా ఒప్పుకొందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాంటివి కొనసాగిస్తామని బీసీసీఐ పేర్కొంది. కోచింగ్లో కొత్త నిబంధనలను తెలుసుకోవడం వల్ల నాలెడ్జి పెరుగుతుందని తెలిపింది.
మరోవైపు తమ నైపుణ్యాలు, మెలకువలు, సామర్థ్యాలను క్రికెట్ అభివృద్ధికి వినియోగించాలనే ఏకైక లక్ష్యంతో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.