అసలేం జరిగింది?
హగ్లీపార్క్లో సమీపంలోని మజీదుపై ప్రార్థన సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
|
నగరంలోని ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. టెస్ట్ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లా క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం.
|
బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా
బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ‘‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి" అని తమీమ్ పేర్కొన్నాడు.
|
బంగ్లా కోచ్ మాట్లాడుతూ
మరోవైపు బంగ్లా కోచ్ మాట్లాడుతూ ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని అన్నాడు.