మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు కీలక సమయంలో షాహిన్ అఫ్రిది గాయపడటమే ప్రధాన కారణమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని ఆ జట్టు చేజార్చుకుంది. సామ్ కరన్ సూపర్ బౌలింగ్కు బెన్ స్టోక్స్ విరోచిత పోరాటం తోడవ్వడంతో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. షాహిన్ గాయపడకుండా ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
'చాంఫియన్స్ ఇంగ్లండ్కు అభినందనలు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు. వారి పోరాటం అద్భుతం. ఈ టోర్నీని మా సొంతగడ్డపై జరుగుతున్నట్లే భావించాం. ప్రతీ వేదికలో అభిమానుల నుంచి మాకు అలాంటి మద్దతు లభించింది. అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మేం తొలి రెండు మ్యాచ్ ఓడిన తర్వాత కూడా వారు అదే ప్రేమను మాపై చూపించారు.
మేం కూడా అసాధారణ ఆటతో ఫైనల్ చేరాం. మా ప్లేయర్లకు నేను చెప్పింది ఒక్కటే మనం మన సహజమైన ఆటను మాత్రమే ఆడాలని. కానీ బ్యాటింగ్లో మేం 20 పరుగులు తక్కువగా చేశాం. అయినప్పటికీ మా బౌలర్లు అసాధారణంగా పోరాటం కనబర్చారు. మా బౌలింగ్ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. దురదృష్టవశాత్తు కీలక సమయంలో షాహిన్ గాయపడటం మా విజయవకాశాలను దెబ్బతీసింది. కానీ ఆటలో ఇవన్నీ సహజమే'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు. కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.